రాష్ట్రపతిని కలిసిన ఆర్థిక మంత్రులు

17 May, 2018 19:12 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ను ఐదు రాష్ట్రాల ఆర్ధికమంత్రులు కలిశారు. ఏపీ ఆర్థిక మంత్రి యనమల నేతృత్వంలో కేరళ, పంజాబ్, ఢిల్లీ, బెంగాల్ రాష్ట్రాల ఆర్ధిక మంత్రులు రాష్ట్రపతితో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా 15 వ ఆర్ధిక సంఘం విధివిధానాలను‌ మార్చాలని మంత్రులు కోరారు. అలాగే కేంద్రం విధివిధానాల విషయంలో జోక్యం చేసుకోవాలని రాష్ట్రపతికి వినతి పత్రం అందజేశారు. 2011 జనాభా నిష్పత్తి ప్రకారం నిధుల పంపకాల విధానంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. అమరావతిలో చేసిన తీర్మానం నివేదికను రాష్ట్రపతికి మంత్రులు అందజేశారు.

కేంద్రం రాష్ట్రాలను అణిచి వేస్తోంది

రాష్ట్రపతిని కలిసిన అనంతరం యనమల మీడియాతో మాట్లాడుతూ.. ‘రాజ్యాంగపరంగా ఆర్టికల్ 280 ప్రకారం ఆర్థిక సంఘం స్వతంత్ర వ్యవస్థ. 14వ ఆర్థిక సంఘం సమయంలో కూడా 1971 జనాభా ప్రతిపాదనే పరిగణనలోకి తీసుకోవాలని తెలుగుదేశం పార్టీ చెప్పింది. ఇప్పుడు కూడా 15వ ఆర్థిక సంఘంలో 1971 జనాభానే తీసుకోవాలని ఇపుడు కూడా డిమాండ్ చేస్తోంది. రాష్ట్రాల ఆర్థిక హక్కులకు కేంద్రం భంగం కలిగించరాదు. ఏపీ సర్కారు రాష్ట్రాల హక్కుల కోసం కేంద్రంపై పోరాటం చేస్తూనే ఉంటుంది. ప్రజాస్వామ్యంలో రాష్ట్రాలకు హక్కులున్నాయి, విధానాలున్నాయి. కేంద్రం బలవంతంగా ఆర్థిక విధానాలను రాష్ట్రాలపై రుద్దరాదు. కేంద్ర ప్రభుత్వ దయదాక్షిణ్యాలపై రాష్ట్రాలు ఆధారపడేలా కేంద్రం వ్యవహరిస్తోంది.

రాష్ట్రాలకు భిక్షం వేసేలా 15వ ఆర్థిక సంఘం వ్యవహరిస్తే అంగీకరించం. రాష్ట్రాలు రాజ్యాంగపరంగా హక్కులను కాపాడుకుంటాయి. రాష్ట్రాలకు ఇన్సెంటివ్స్‌తో ఉపయోగం ఉండదు. కేంద్రం రాష్ట్రాల హక్కులను కాలరాయరాదు.15 వ ఆర్థిక సంఘం సిఫార్సులపై జూన్‌లో జాతీయ స్థాయిలో సదస్సు ఏర్పాటు చేస్తాము. వెనుకబడిన రాష్ట్రాల పేరుతో కేంద్రం అభివృద్ధి చెందుతోన్న రాష్ట్రాలను నాశనం చేయాలనుకుంటే చూస్తూ కూర్చోము. కేంద్రం కావాలనుకుంటే వెనుకబడిన రాష్ట్రాలకు ప్రత్యేకంగా కేటాయింపులు చేయాలి. 
కేంద్రం రాష్ట్రాలను అణచి వేసేందుకు చూస్తోందనేందుకు కర్ణాటక ఉదాహరణ.’  అన్నారు

మరిన్ని వార్తలు