మోదీకి అలీగఢ్‌ యూనివర్సిటీ విద్యార్థుల లేఖ

11 May, 2018 20:18 IST|Sakshi

లక్నో: అలీగఢ్‌ ముస్లిం యూనివర్సిటీలో మహ్మద్‌ అలీ జిన్నా చిత్రపటాన్ని తొలగించాలని ఘర్షణలకు పాల్పడ్డ హిందుత్వ కార్యకర్తలపై చర్యలు తీసుకోవాలని యూనివర్సిటీ విద్యార్థులు ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు. గత కొన్ని రోజులుగా ఉత్తరప్రదేశ్‌లోని అలీగఢ్‌ ముస్లిం యూనివర్సిటీలో పాకిస్తాన్‌ వ్యవస్థాపకుడు మహ్మద్‌అలీ జిన్నా ఫొటోపై వివాదం రేగుతున్న విషయం తెలిసిందే. ఆర్‌ఎస్‌ఎస్‌, బీజేపీ కార్యకర్తలు  యూనివర్సిటీలో జిన్నా చిత్రపటానికి వ్యతిరేకంగా దాడులకు పాల్పడ్డారని విద్యార్థులు ఆరోపిస్తున్నారు.

దాడులకు పాల్పడుతూ, చారిత్రాత్మక యూనివర్సిటీ ఖ్యాతిని పోగొడుతున్న హిందుత్వ కార్యకర్తలపై చర్యలు తీసుకోవాలని ప్రధాని మోదీ, యూపీ సీఎం ఆదిత్యానాథ్‌, మానవ వనరుల శాఖ మంత్రి ప్రకాశ్‌ జవదేకర్‌కి విద్యార్థులు శుక్రవారం లేఖ రాశారు. ప్రతిష్టాత్మక యూనివర్సిటీ వాతావరణాన్ని చెడగొడుతున్న హిందూత్వ కార్యకర్తల మీద చర్యలు తీసుకోవాలని యూనైటేడ్‌ అరబ్‌ ఏమిరేట్స్‌లో(యూఏఈ) అల్యూమ్ని ఫోరమ్ తరఫున కూడా భారత కాన్సూలేటర్‌కి  లేఖ రాశారు.

యోగా గురువు రాందేవ్‌ బాబా జిన్నాకు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేశారన్న విషయాన్ని కూడా వారు లేఖలో పేర్కొన్నారు. జిన్నా పాకిస్తానీయులకు గొప్పవాడే, కానీ భారతీయులు అతన్ని ఆదర్శంగా తీసుకోవాల్సిన అవసరం లేదని రాందేవ్‌ వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే.

మరిన్ని వార్తలు