దౌలాకువా గ్యాంగ్ రేప్ కేసు ఐదుగురూ దోషులే

15 Oct, 2014 03:14 IST|Sakshi
దౌలాకువా గ్యాంగ్ రేప్ కేసు ఐదుగురూ దోషులే

సాక్షి, న్యూఢిల్లీ : దౌలాకువా సామూహిక అత్యాచారం కేసులో ఐదుగురు నిందితులను దోషులుగా పేర్కొంటూ ద్వారకా న్యాయస్థానం తీర్పు ఇచ్చింది. ఈ నెల 17న శిక్షలను ఖరారు చేయనుంది. ఈశాన్య ప్రాంతానికి చెందిన కాల్ సెంటర్ ఉద్యోగినిపై గ్యాంగ్‌రేప్ కేసులో షంషద్ అలియాస్ ఖుట్కన్, ఉస్మాన్ అలియాస్ కాలే, షంషీద్ అలియాస్ చోటా బిల్లి, ఇక్బాల్ అలియాస్ బడా బిల్లి, కమ్రయిద్దీన్‌లను దోషులుగా తేల్చింది. కాగా 2010 నవంబర్ 24 నాటి రాత్రి కాల్ సెంటర్‌కు చెందిన ఇద్దరు ఉద్యోగినులు తాము నివసించే కాలనీ గేటు వద్ద వాహనం దిగి ఇంటికి వెళుతున్నారు. అదే సమయంలో ఓ వాహనంలో అక్కడికి వచ్చిన ఐదుగురు బాధితురాలిని అపహరించి మంగోల్‌పురి ప్రాంతానికి తీసుకెళ్లి అదే వాహనంలో సామూహిక అత్యాచారం చేశారు.
 
 ఆ తరువాత వారు ఆమెను మంగోల్‌పురిలోని రోడ్డుపై వదిలేసి పారిపోయారు. మరోవైపు సహోద్యోగిని కొందరు అపహరించుకునిపోయారని బాధితురాలి స్నేహితురాలు పోలీస్ కంట్రోల్‌రూంకు ఫోన్‌చేసింది. దీంతో అప్రమత్తమై రంగంలోకి దిగిన పోలీసులు  బాధితులి జాడను కనుగొని ఆస్పత్రికి తరలించారు. సరిగ్గా  ఏడురోజుల తర్వాత నిందితులందరినీ హర్యానాలోని మేవాత్ ప్రాంతంలో అరెస్టు చేశారు. తాము అమాయకులమని, అన్యాయంగా తమను ఈ కేసులో ఇరికించారని నిందితులు కోర్టులో వాదించారు. కాగా పోలీసులు జరిపిన ఐడెంటిఫికేషన్ పరేడ్‌లో బాధితురాలు.. షంషద్, ఉస్మాన్‌లను బాధితురాలు గుర్తించింది. అయితే కమరుద్దీన్, షహీద్, ఇక్బాల్‌లు మాత్రం ఈ పరేడ్‌లో పాల్గొనడానికి నిరాకరించారు. నిందితులు తమ నేరాన్ని అంగీకరించారని, కమ్రుద్దీన్ పశ్చాతాపం కూడా వ్యక్తం చేశాడని పోలీసులు తమ అభియోగపత్రంలో పేర్కొన్నారు.
 
 ఎంతో సమయం పట్టింది : బృందాకారత్
 న్యూఢిల్లీ: న్యాయం జరిగేందుకు ఎంతో సమయం పట్టిందని ఐద్వా సంస్థ మాజీ ప్రధాన కార్యదర్శి బృందాకారత్ అభిప్రాయపడ్డారు. అయినప్పటికీ న్యాయం జరగబోతోందన్నారు.
 
 హర్షం వ్యక్తం చేసిన మహిళా హక్కుల సంఘాలు
 న్యూఢిల్లీ: దౌలాకువాన్ సామూహిక అత్యాచారం కేసులో ఐదుగురు నిందితులను న్యాయస్థానం దోషులుగా ప్రకటించడంపట్ల మహిళా హక్కుల సంఘాలు హర్షం వ్యక్తం చే శాయి. ‘ఇటువంటి తీర్పులు దేశవాసుల్లో  న్యాయవ్యవస్థపై నమ్మకం పెంచుతాయని అఖిల భారత ప్రజాస్వామిక మహిళా సంఘం (ఐద్వా) ప్రధాన కార్యదర్శి జగ్మతి సంగ్వాన్ పేర్కొన్నారు. మంగళవారం ఆమె ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ ‘బాధితురాలిని హింసించినవారికి కఠిన శిక్ష పడేలా మనం చూడాల్సి ఉంది. అలా జరిగితే ఇటువంటి హింస మళ్లీ పునరావృతం కాదు’ అని అన్నారు. ఈ సందర్భంగా అన్నీ రాజా అనే మహిళా హక్కుల కార్యకర్త మాట్లాడుతూ ‘అటువంటి తీర్పు ఇటువంటి నేరాలను కచ్చితంగా తగ్గేలా చేస్తుంది. పోలీసులు, న్యాయవ్యవస్థ సరిగా పనిచేయకతే నేరాలు చేసి తప్పించుకుపోవచ్చని నిందితులంతా అనుకుంటారు. పోలీసులు, న్యాయవ్యవస్థపై ప్రజలకు విశ్వాసం పెరిగితే నేరాలు వాటంతట అవే తగ్గిపోతాయి’ అని అన్నారు.
 

మరిన్ని వార్తలు