మరో ఉగ్ర దాడి

7 Oct, 2016 01:26 IST|Sakshi
మరో ఉగ్ర దాడి

ముగ్గురిని మట్టుపెట్టిన సైన్యం
 ♦ కుప్వారా జిల్లాలో ఆర్మీ శిబిరంపై ఉగ్రవాదుల కాల్పులు
 ♦ ఆయుధాలు, మందుగుండు, వాకీటాకీలను స్వాధీనం చేసుకున్న ఆర్మీ
 ♦ ఎల్వోసీ వెంట ఉగ్ర చొరబాట్లు  విఫలం.. నలుగురి హతం
 ♦ సర్జికల్ దాడులపై ఆధారాలు చూపాల్సిన అవసరం లేదు: పరీకర్
 
శ్రీనగర్/ఆగ్రా: కశ్మీర్‌లో నియంత్రణ రేఖ వెంట ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. గురువారం సైనిక శిబిరంపై కాల్పులకు తెగబడగా... సైన్యం ఉగ్రదాడిని సమర్థంగా తిప్పికొట్టి ముగ్గురు ఉగ్రవాదుల్ని హతమార్చింది. కుప్వారా జిల్లా లాన్‌గేట్ వద్ద ఆర్మీ శిబిరంపై తెల్లవారుజామున 5 గంటల ప్రాంతంలో ఉగ్రవాదులు ఒక్కసారిగా కాల్పులు  ప్రారంభించారు. అప్రమత్తంగా ఉన్న సైన్యం వెంటనే ఎదురుదాడి ప్రారంభించింది. ఎన్‌కౌంటర్ స్థలం నుంచి భారీగా ఆయుధాలు, మందుగుండు, మ్యాప్‌లు వంటి సామగ్రి స్వాధీనం చేసుకున్నామని ఆర్మీ సీనియర్ అధికారి ఒకరు వెల్లడించారు.
 
ఆర్మీ కమాండింగ్ అధికారి కల్నల్ రాజీవ్ శారంగ్ కథనం ప్రకారం... సైనిక శిబిరం కంచె పరిధిలో అనుమానాస్పద కదలికల్ని గమనించిన జవాన్లు అప్రమత్తమై ఉగ్రవాదుల్ని మట్టుబెట్టారని తెలిపారు. ‘శిబిరానికి కాపలాగా ఉన్న సెంట్రీ పోస్టులపై పెద్ద ఎత్తున కాల్పులు మొదలయ్యాయి. జవాన్లు కూడా ప్రతిదాడి చేశారు.వెంటనే క్విక్ రియాక్షన్ బృందం అప్రమత్తతతో ఉగ్రవాదులు తప్పించుకోలేకపోయారు. వెంటనే ప్రకాశవంతమైన పరికరాల సాయంతో ఉగ్రవాదుల్ని కనిపెట్టి హతమార్చారు’ అని చెప్పారు. హతులైన ఉగ్రవాదుల నుంచి మూడు ఏకే రైఫిల్స్, మూడు అండర్ బ్యారెల్ గ్రనేడ్ లాంచర్స్, పెద్ద ఎత్తున మ్యాగజీన్స్, బుల్లెట్లు, నాలుగు వాకీ టాకీ రేడియో సెట్లు, మూడు జీపీఎస్ పరికరాలు, మూడు మొబైల్ ఫోన్లు, డ్రై ఫ్రూట్స్, మందులు, మ్యాప్‌లు, మాట్రిక్స్ షీట్‌లు స్వాధీనం చేసుకున్నారు.
 
మందులపై పాకిస్తాన్‌లో తయారైనట్లు ముద్రలు ఉండడంతో ఉగ్రవాదుల్ని పాకిస్తాన్‌కు చెందిన వారిగా నిర్ధారించామని కల్నల్ శారంగ్ వెల్లడించారు. మరింత మంది ఉగ్రవాదులు ఉండవచ్చా? అని ప్రశ్నించగా.. ‘ఉండవచ్చు. అయితే కేవలం ముగ్గుర్ని మాత్రమే హతమార్చాం. కంచె దాటేందుకు ప్రయత్నించిన ఉగ్రవాదుల్ని మాత్రమే గుర్తించాం. సమీప ప్రాంతాల్లో వెదుకులాట, అప్రమత్తత చర్యలు కొనసాగుతున్నాయి. మ్యాప్‌ల్ని, మ్యాట్రిక్స్ షీట్లను విశ్లేషిస్తున్నాం. వాటి ద్వారా మరిన్ని వివరాలు తెలిస్తే వెల్లడిస్తాం’ అని చెప్పారు. ఒక్కోసారి ఉగ్రవాదులు ఒకటి కంటే ఎక్కువ రేడియో సెట్లను వాడతారని, అందుకే నాలుగు సెట్లను స్వాధీనం చేసుకున్నామన్నారు. ఉగ్రవాదుల నుంచి స్వాధీనం చేసుకున్న డ్రై ఫ్రూట్స్, మందుల్ని బట్టి కొద్ది రోజులుగా క్యాంప్‌పై దాడికి ప్రయత్నిస్తున్నారని అర్థమవుతుందన్నారు.
 
నూరు శాతం సర్జికల్ దాడులే
సైనిక చర్యకు సంబంధించి వీడియో ఆధారాలు ఇవ్వాల్సిన అవసరం లేదని కేంద్ర రక్షణ శాఖ మంత్రి మనోహర్ పరీకర్ గురువారం చెప్పారు. ఆగ్రాలో బీజేపీ బహిరంగ సభలో మాట్లాడుతూ... నియంత్రణ రేఖ వెంట జరిగిన దాడి నూటికి నూరు శాతం సర్జికల్ దాడేనన్నారు. దేశం పట్ల విశ్వాసం చూపని వారి విషయంలో జాగరూకతతో ఉండాలని హెచ్చరించారు.
 
మన బలగాల ధైర్యం పట్ల ఇంతవరకూ ఎవరికీ అనుమానం లేదని... మొదటిసారి కొందరు వ్యక్తులు సందేహపడుతున్నారని పరీకర్
విమర్శించారు. ఒక జాతీయ న్యూస్ చానల్ కథనం ప్రకారం సర్జికల్ దాడి జరిగినట్లు పాకిస్తాన్ పోలీసు అధికారి అంగీకరించారన్నారు. సరిహద్దుల్లో పోరాటానికి అవసరమైతే చాలామంది మాజీ సైనికులు సిద్ధంగా ఉన్నారని చెప్పారు.
 
పాక్ హోదాపై సమీక్షిస్తాం: భారత్
పాకిస్తాన్‌కు ఇచ్చిన అత్యంత ప్రాధాన్య దేశంగా ఇచ్చిన హోదాపై పునఃసమీక్షిస్తామని భారత్ ప్రకటించింది. భద్రతా, వాణిజ్య ఆసక్తులు ఆధారంగా ఈ సమీక్ష చేస్తామని, ఉగ్రవాదం ఎగుమతి చేసే వస్తువు కాదని విదేశీ వ్యవహారాల శాఖ ప్రతినిధి వికాస్ స్వరూప్ చెప్పారు.

3 చొరబాటు యత్నాల్ని తిప్పికొట్టిన ఆర్మీ
జమ్మూ కశ్మీర్‌లో నియంత్రణ రేఖ వెంట ఆర్మీ మూడు చొరబాట్ల యత్నాల్ని విఫలం చేసి నలుగురు ఉగ్రవాదుల్ని మట్టుబెట్టింది. గురువారం తెల్లవారుజామున నౌగామ్ సెక్టార్‌లో చొరబాటును అడ్డుకుని నలుగురిని హతమార్చామని ఆర్మీ వర్గాలు వెల్లడించాయి. మరింత మంది ఉగ్రవాదులు ఉండవచ్చన్న అనుమానంతో కూంబింగ్ నిర్వహిస్తున్నామని తెలిపాయి. నౌగామ్, రాంపూర్ సెక్టార్లలో బుధవారం రాత్రి రెండు చొరబాటు యత్నాల్ని తిప్పికొట్టామని ఆ వర్గాలు పేర్కొన్నాయి.

మరిన్ని వార్తలు