కాలేజీ విద్యార్థిని హత్య ; బాయ్‌ఫ్రెండ్‌కు ఉరిశిక్ష..!

3 Aug, 2019 17:21 IST|Sakshi

గువాహటి : ప్రేమించిన యువతిని హత్యచేసిన ఓ యువకుడికి గువాహటి ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టు ఉరిశిక్ష విధిస్తూ సంచలన తీర్పు వెలువరించింది. సహకరించిన అతని తల్లి, సోదరికి జీవిత ఖైదు విధిస్తూ గత బుధవారం తీర్పునిచ్చింది. హత్యకు గురైన యువతి 2015లో ఇంటర్‌ స్టేట్‌ ఫస్ట్‌ విద్యార్థి కావడం గమనార్హం. చార్జిషీట్‌ ప్రకారం.. శ్వేత అగర్వాల్‌, గోవింద్‌ సింఘాల్‌ ప్రేమించుకున్నారు. 2017, డిసెంబర్‌ 4న యువతి గోవింద్‌ ఇంటికి వెళ్లారు. అయితే, పెళ్లి విషయంలో ఇద్దరి మధ్య మాటామాటా పెరిగి వివాదం మొదలైంది. దీంతో గోవింద్‌ శ్వేత తలను గోడకేసి బాదాడు. 

తలకు బలమైన గాయమవడంతో ఆమె అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయారు. తల్లి, సోదరి సాయంతో గోవింద్‌ శ్వేతపై పెట్రోల్‌ పోసి నిప్పంటించి హత్య చేశారు. అనంతరం ఆత్మహత్యగా చిత్రీకరించి అందరినీ నమ్మించే యత్నం చేశారు. విచారణ చేపట్టిన పోలీసులు శ్వేత హత్యకు గురైనట్టు తేల్చారు. ఆ ముగ్గురిపై మర్డర్‌ కేసు నమోదు చేశారు. కోర్టు వారిని దోషులుగా తేల్చింది. రెండేళ్ల అనంతరం గోవింద్‌కు మరణ శిక్ష, అతని తల్లి, సోదరికి జీవిత ఖైదు విధిస్తూ ఫాస్ట్‌ట్రాక్‌ కోరు​ తీర్పునిచ్చింది.

మరిన్ని వార్తలు