పోలీసులను కుక్కలతో పోల్చిన కాంగ్రెస్ ఎమ్మెల్యే

28 Jun, 2015 20:05 IST|Sakshi
పోలీసులను కుక్కలతో పోల్చిన కాంగ్రెస్ ఎమ్మెల్యే

కోల్కతా: 'ఖాకీ బట్టలు వేసుకున్న పోలీసు కుక్కలకు ఇదే నా హెచ్చరిక.. ప్రతిదానికి ఓ హద్దు ఉంటుంది. అధికార పార్టీకి ఊడిగం చేయడం మానేయండి. మీ ఆధారంతో వాళ్లు.. వాళ్ల అండతో మీరు చేస్తున్న అకృత్యాలకు తెరదించండి' అంటూ పశ్చిమ బెంగాల్ కాంగ్రెస్ ఎమ్మెల్యే ఆశిష్ మర్జిత్ ఆవేశంతో ఊగిపోయారు. తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి పెంపుడు జంతువులుగా మారారని, తక్షణమే తీరు మార్చుకోవాలని పోలీసులపై ఇష్టారీతిగా కామెంట్లు చేశారు. ఆదివారం కోల్కతాలో కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఆ సమయంలో బీపీసీసీ అధ్యక్షుడు అధిర్ రంజన్ చౌదరీ కూడా వేదికపైనే ఉన్నారు.

కాగా, కాంగ్రెస్ ఎమ్మెల్యే వ్యాఖ్యలను పలు రాజకీయపార్టీలు తప్పుపట్టాయి. 'వివాదాస్సద వ్యాఖ్యలు చేయడం రాజకీయ నాయకులకు అలవాటుగా మారింది. తద్వారా పాపులారిటీ వస్తుందనే దురాలోచనే వారిచేత అలా మాట్లాడిస్తోంది. నిజానికి తృణమూల్ కాంగ్రెస్ పార్టీ వాళ్లే ఈ దుష్ఠసంసృతికి ఆద్యులు. ఇప్పుడు అవే వారిపైకి అస్త్రాలుగా వస్తున్నాయి' అని సీపీఎం ఎంపీ మహమ్మద్ సలీమ్ అన్నారు.

మరిన్ని వార్తలు