పౌరసత్వ బిల్లుకు పూర్తి వ్యతిరేకం: మాజీ కెప్టెన్‌

5 Dec, 2019 11:44 IST|Sakshi
భారత మాజీ పుట్‌బాల్‌ కెప్టెన్‌ బైచుంగ్‌ భూటియా

గ్యాంగ్‌టక్‌: వివాదాస్పద పౌరసత్వ సవరణ ముసాయిదా బిల్లు 'అత్యంత ప్రమాదాకారి' అని భారత పుట్‌బాల్‌ మాజీ కెప్టెన్‌ బైచుంగ్‌ భూటియా(43) అన్నారు. పాకిస్తాన్‌, ఆఫ్ఘనిస్తాన్‌, బంగ్లాదేశ్‌ దేశాల నుంచి భారత్‌కు తరలి వచ్చిన ముస్లిమేతర శరణార్థులకు పౌరసత్వం కల్పించేందుకు ఉద్దేశించిన ఈ బిల్లుకు తాను పూర్తి వ్యతిరేకిని అని పేర్కొన్నారు. పౌరసత్వ సవరణ ముసాయిదా బిల్లు సిక్కిం ప్రజల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని చేయలేదని సిక్కింకు చెందిన ఈ ఫుట్‌బాల్‌ దిగ్గజం అభిప్రాయపడ్డారు. 

‘బంగ్లాదేశ్‌కు దగ్గరగా ఉన్న కారణంగా ఇప్పటికే బెంగాల్, ఇతర ఈశాన్య రాష్ట్రాలు పలు సమస్యలు ఎదుర్కొంటున్నాయి. ఇక సిక్కిం రాష్ట్రం కూడా బంగ్లాదేశ్‌కు చాలా దగ్గరగా ఉన్న కారణంగా దీర్ఘకాలంలో ప్రభావితమవుతుంది’ అని 'హమ్రో సిక్కిం పార్టీ' అధినేత భైచుంగ్ భూటియా పేర్కొన్నారు. సిక్కిం క్రాంతికారి మోర్చా, బీజేపీ సారథ్యంలో నడుస్తున్న సిక్కిం ప్రభుత్వం.. పౌరసత్వ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా పోరాడుతున్న ఇతర ఈశాన్య బీజేపీ మిత్రపక్షాలను ఆదర్శంగా తీసుకోవాలన్నారు.  

అంతేకాక శాసనసభలో ఈ అంశానికి సంబంధించి తాను, తన పార్టీ వ్యతిరేకంగా వాదిస్తామన్నారు. సిక్కిం ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు హమ్రో సిక్కిం పార్టీ సిద్ధంగా ఉందని, అవసరమైతే కేంద్ర హోం మంత్రిత్వ శాఖకు, ప్రధానమంత్రి కార్యాలయానికి లేఖ రాసేందుకు సిద్ధమని భైచుంగ్ అన్నారు. సిక్కింలో ఆర్టికల్ 371 (ఎఫ్)లో సిక్కిం సబ్జెక్ట్ యాక్ట్, రాజ్యాంగం ఉందన్నారు. కాగా ముస్లింలపై వివక్ష చూపేందుకు బీజేపీ ప్రభుత్వం దిగజారుడు రాజకీయాలు చేస్తుందని, ఈ మతతత్వ బిల్లుకు వ్యతిరేకమని ప్రతిపక్షాలు వాదిస్తున్న విషయం తెలిసిందే.

మరిన్ని వార్తలు