మహిళా మంత్రి కుమారుడిపై దాడి

4 Nov, 2019 08:44 IST|Sakshi

పట్నా : బిహార్‌కు చెందిన ఓ మంత్రి కొడుకుపై కొందరు వ్యక్తులు దాడికి పాల్పడ్డారు. ఈ ఘటన మాధేపురా జిల్లాలో ఆదివారం ఉదయం చోటు చేసుకుందని పోలీసులు తెలిపారు. వివరాల్లోకి వెళితే.. బిహార్‌ మంత్రి బీమా భారతి  కొడుకు రాజ్‌కుమార్‌ శ్రీపూర్‌ గ్రామంలో తన స్నేహితుడిని డ్రాప్‌ చేసి ఇంటికి బయలుదేరాడు. ఆ సమయంలో కారులో రాజ్‌కుమార్‌తో పాటు అతని కజిన్‌ సంజయ్‌కుమార్‌ కూడా ఉన్నాడు. అయితే భట్గామ గ్రామ సమీపంలో ముగ్గురు వ్యక్తులు వీరి కారును ఆపారు. అనంతరం రాజ్‌కుమార్‌, సంజయ్‌లపై దాడి చేశారు. రివాల్వర్‌ బట్‌తో వారిని కొట్టారు. 

ఈ ఘటనలో గాయపడ్డ రాజ్‌కుమార్‌, సంజయ్‌లను చికిత్స నిమిత్తం చౌసా పీహెచ్‌సీకి తరలించారు. అయితే దీనిపై కేసు నమోదు చేసుకుని విచారణ జరుపుతున్నట్టు పోలీసులు వెల్లడించారు. కాగా, ఈ ఘటనపై బీమా భారతి తీవ్రంగా స్పందించారు. తన కుమారుడిపై దాడికి పాల్పడిన వారిని వెంటనే అరెస్ట్‌ చేయాలని ఆమె డిమాండ్‌ చేశారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని అన్నారు. తన కుమారుడు ప్రయాణిస్తున్న మార్గంలో వాహనాలు నడుపడంపై ఏమైనా నిషేధం ఉందా అని మంత్రి ప్రశ్నించారు.
 

మరిన్ని వార్తలు