రాజయ్య కోడలికి మీరేం న్యాయం చేశారు?

5 Dec, 2015 17:52 IST|Sakshi
రాజయ్య కోడలికి మీరేం న్యాయం చేశారు?

న్యూఢిల్లీ:  దళితులపై  హింసను అడ్డుకునే  పేరుతో కాంగ్రెస్ రాజకీయాలకు పాల్పడుతోందని బీజీపీ  ఆరోపించింది.  బీజేపీ అధికార ప్రతినిధి జీవిఎల్ నరసింహారావు శనివారం ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ... సిరిసిల్ల   రాజయ్య కోడలు  సారిక ఆత్మహత్య ఘటనపై కాంగ్రెస్ పార్టీపై విమర్శలు గుప్పించారు.  ముగ్గురు పిల్లలు సహా  సారిక ఆత్మహత్యకు పాల్పడితే ఆమెకు కాంగ్రెస్  పార్టీ ఏ న్యాయం చేసిందని  విరుచుకుపడ్డారు. దళితులపై కపట ప్రేమ ఒలకబోస్తున్న కాంగ్రెస్, ఆ పార్టీ ఎంపీ ఇంట్లో జరిగిన ఘోరంపై ఎందుకు నోరు విప్పడం లేదని మండిపడ్డారు.    

కాంగ్రెస్ మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్య కోడలు, ముగ్గురు  పిల్లల  సజీవ దహన ఘటనపై .. దళితులకు మీరు చేసే న్యాయం ఇదేనా అని సోనియాని ఈ సందర్భంగా నరసింహారావు ప్రశ్నించారు. గత నవంబర్ 4న జరిగిన అగ్నిప్రమాదంలో రాజయ్య కోడలు సారికతో సహా ముగ్గురు పిల్లలు అభినవ్‌, అయోన్‌, శ్రీయోన్‌లు సజీవ దహనమయ్యారు. కొద్దిరోజులుగా రాజయ్యకు ఆయన కోడలు సారికకు మధ్య విభేదాల నేపథ్యంలో కోడలు సారిక పిల్లలతో కలిసి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన వివాదాన్ని రేపిన సంగతి తెలిసిందే.

మరిన్ని వార్తలు