భార్యా బాధితుల కోసం ‘పురుష్‌ ఆయోగ్‌’

4 Aug, 2018 04:55 IST|Sakshi

న్యూఢిల్లీ: భార్యాబాధితులైన మగవారి కోసం ప్రత్యేకంగా ‘పురుష్‌ ఆయోగ్‌’ ఏర్పాటు చేయాలని అధికార పార్టీ సభ్యుడొకరు డిమాండ్‌ చేయడంతో లోక్‌సభ నవ్వులతో నిండిపోయింది. బీజేపీకి చెందిన హరినారాయణ్‌ రాజ్‌భర్‌ శుక్రవారం లోక్‌సభ జీరోఅవర్‌లో ఈ విషయాన్ని ప్రస్తావించారు. మహిళల సమస్యలను పరిశీలించేందుకు మహిళా ఆయోగ్‌ వంటి ఎన్నో కమిషన్లు వేసిన ప్రభుత్వం..పురుషుల సమస్యల పరిష్కారానికి ఒక్కటీ ఏర్పాటు చేయలేదన్నారు. ‘భార్యల కారణంగా మగవారు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. కొందరు జైలుపాలయ్యారు. ఇలాంటి వారి ఇబ్బందులు తీర్చేందుకు ప్రభుత్వం పురుష్‌ ఆయోగ్‌ ఏర్పాటు చేయాలి’ అని కోరారు. ఆయన డిమాండ్‌ వినగానే ఐదుగురు మహిళా ఎంపీలతో పాటు సభ్యులంతా ఘొల్లున నవ్వారు. ఈ సందర్భంగా సభ్యుల సరదా వ్యాఖ్యానాలతో సభలో ఉల్లాసపూరిత వాతావరణం కనిపించింది.

మరిన్ని వార్తలు