న్యూఢిల్లీ: చాలా మంది ప్రాణాలను బలిగొంటున్న బ్లూవేల్ వేల్ చాలెంజ్ గేమ్ దుష్ప్రభావాలను వివరిస్తూ ఒక వారంలోగా పది నిమిషాల కార్యక్రమాన్ని రూపొందించి ప్రదర్శించాలని దూరదర్శన్ను సుప్రీంకోర్టు ఆదేశించింది. ‘మీరెలా చేస్తారో మాకు తెలీదు.. కానీ కచ్చితంగా ఈ పని చేసి తీరాలి’అని చీఫ్ జస్టిస్ దీపక్ మిశ్రా నేతృత్వంలోని న్యాయమూర్తులు జస్టిస్ ఏఎం కన్వీల్కర్, జస్టిస్ డీవై చంద్రచూడ్ల బెంచ్ ఆదేశించింది.బ్లూవేల్ చాలెంజ్ లాంటి ప్రమాదకర ఆటలను నిరోధించేందుకు మార్గదర్శకాలను రూపొందించేలా కేంద్రానికి ఆదేశాలు ఇవ్వాలంటూ న్యాయవాది స్నేహ కలిటా సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. దీనిపై విచారణ చేపట్టిన బెంచ్.. డాక్యుమెంటరీని ప్రైమ్ టైమ్ సమయాల్లో ప్రైవేట్ చానళ్లలోనూ ప్రదర్శించేలా సంబంధిత అధికారులను ఆదేశించింది.