స్వదేశానికి ‘ఇరాక్‌ మృతదేహాలు’

3 Apr, 2018 02:25 IST|Sakshi
అమృత్‌సర్‌లో శవపేటిక వద్ద బంధువుల రోదన

శవపేటికలను తెరవడం ప్రమాదకరం: వీకే సింగ్‌

అమృత్‌సర్‌/కోల్‌కతా: ఇరాక్‌లో ఐసిస్‌ ఉగ్రవాదుల చేతిలో చనిపోయిన 39 మంది భారతీయుల్లో 38 మృతదేహాలను ప్రత్యేక విమానంలో కేంద్రం సోమవారం భారత్‌కు తీసుకొచ్చింది. మరొక మృతదేహం ఎవరిదనే విషయం కచ్చితంగా నిర్ధారణ కాకపోవటంతో దాన్ని ఇరాక్‌లోనే ఉంచారు. మృతదేహాలను తీసుకొచ్చేందుకు విదేశాంగ శాఖ సహాయ మంత్రి వీకే సింగ్‌ ఆదివారం ఇరాక్‌ వెళ్లడం తెలిసిందే. 38 మృతదేహాల్లో 27 పంజాబ్‌కు, నాలుగు హిమాచల్‌ ప్రదేశ్‌కు చెందినవి కావడంతో ఆ 31 మృతదేహాలను అమృత్‌సర్‌లోని విమానాశ్రయంలో బంధువులకు అప్పగించారు.

మిగిలిన ఏడింటిని కోల్‌కతా, పట్నా విమానాశ్రయాల్లో ఆప్తులకు అధీన పరిచారు. వీరంతా దాదాపు సంవత్సరం క్రితమే చనిపోయారనీ, భూమిలో పాతిపెట్టిన శవాలను ఇటీవల వెలికి తీసి తెచ్చినందున ఇప్పుడు ఈ శవపేటికలను తెరవడం మంచిది కాదని వీకే సింగ్‌ సూచించారు. శవాలను పాతిపెట్టిన స్థలంలో విషపదార్థాలు ఉండేవనీ, అలాగే మృతదేహాలను ఎంబామింగ్‌ చేసి శవపేటికల్లో పెట్టడంతో వాటిని తెరవడం ప్రమాదకరమని ఆయన హెచ్చరించారు.
 

మరిన్ని వార్తలు