మూడేళ్ల తర్వాత మోక్షం

26 Jun, 2014 22:55 IST|Sakshi

నోయిడా: ప్రతిపాదిత బొటానికల్ గార్డెన్ (నోయిడా)-కాళిందీకుంజ్ (ఢిల్లీ) మార్గానికి ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్ ఆమోదముద్ర వేశారు. దీంతో మూడేళ్ల క్రితం ప్రతిపాదించిన ఈ కారిడార్‌కు ఎట్టకేలకు మోక్షం లభిచింది. మూడో దశలో భాగంగా ప్రతిపాదించిన ఈ కారిడార్‌కు సంబంధించిన అవగాహన పత్రం (ఎంఓయూ)పై సంతకం చేయాలని నోయిడా అథారిటీ చైర్మన్ రమారమణ్‌ను ఆయన ఆదేశించారు. యూపీ ప్రభుత్వం... ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ (డీఎంఆర్‌సీ)తో ఇందుకు సంబంధించి త ్వరలో ఓ ఒప్పందం కుదుర్చుకోనున్నాయి. దీంతో ఇప్పటిదాకా పెండింగ్‌లో ఉన్న ఈ ప్రా జెక్టు పనులు ఆగమేఘాలపై ముందుకు సాగనున్నాయి.
 
 ఈ విషయమై నోయిడా అథారిటీ చైర్మన్ రమారమణ్ మీడియాతో మాట్లాడుతూ డీఎంఆర్‌సీతో సంతకం చేయాల్సిన ఒప్పందానికి సంబంధించిన అన్ని లాంఛనాలను సిద్ధం చేశామన్నారు. అవగాహనపత్రం ముసాయిదాను ఆమో దం కోసం ఈ ఏడాది మే నెలలోనే ప్రభుత్వానికి పంపించామన్నారు. డీఎంఆర్‌సీ అధికారులతో సమావేశమవనున్నామన్నారు. ఇందుకు సంబంధించిన తేదీని ఖరారు చేస్తామన్నారు. ఈ ప్రక్రియ పూర్తయితే పనులు మొదలుపెడతామన్నారు. కాగా ఈ ప్రాజెక్టు అంచనా వ్యయం రూ. 845 కోట్లు. 2016, మార్చినాటికల్లా దీనిని పూర్తి చేయాలని  ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ ప్రాజెక్టు నిర్మాణానికి అయ్యే వ్యయంలో 80 శాతం  ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం, 20 శాతం కేంద్ర ప్రభుత్వం భరించనున్నాయి.
 
 ఈ ప్రాజెక్టుకు సంబంధించి డీఎంఆర్‌సీ ఇప్పటికే బిడ్లను ఆహ్వానించింది. ఈ విషయమై నోయిడా అథారిటీ చైర్మన్ రమారమణ్ మాట్లాడుతూ ఈ ప్రాజెక్టు కోసం డీఎంఆర్‌సీకి ఇప్పటికే దాదాపు రూ. 41 కోట్లు చెల్లించామన్నారు. సంబంధిత అధికారులు ఈ ప్రాజెక్టుకు సంబంధించి త్వరలో సమగ్ర అధ్యయనం చేస్తారని తెలిపారు. సెక్టార్-51లో యార్డు నిర్మాణం కోసం డీఎంఆర్‌సీకి ఇప్పటికే 55 వేల చదరపు మీటర్ల స్థలాన్ని అప్పగించామన్నారు. కాగా ఈ మార్గంలో మొత్తం మూడు స్టేషన్లు ఉంటాయి. అవి బొటానికల్ గార్డెన్, ఓఖ్లా బర్డ్ శాంక్చురీ (నోయిడా), కాళిందీ కుంజ్ (ఢిల్లీ). ఈ మార్గంలో ఆరు, ఎనిమిది బోగీలు కలిగిన మెట్రో రైళ్లను అందుబాటులోకి తీసుకొస్తారు. ఒక్కొక్క బోగీలో 1,756 నుంచి 2,352 మంది ప్రయాణించేందుకు వీలవుతుంది. కాగా మరో రెండు కారిడార్‌లను కూడా ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ప్రతిపాదించింది. అవి నోయిడా సెంటర్-సెక్టార్ 62, నోయిడా-గ్రేటర్ నోయిడా. అయితే ఈ ప్రతిపాదనలకు ఆమోదం లభించాల్సి ఉంది
 

మరిన్ని వార్తలు