- బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్
- ఢిల్లీలో కోవింద్తో భేటీ
సాక్షి, న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ దళితులను ఎప్పుడూ ఓటర్లుగానే చూసిందని, వారిని తమ రాజకీయాలకు ఉపయోగించుకుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్ విమర్శించారు. ఆదివారం ఆయన ఢిల్లీలో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి పి.మురళీధర్రావు, కేంద్ర జల వనరుల శాఖ సలహాదారు శ్రీరాం వెదిరె, పార్టీ సమన్వయ కర్త ఎన్.బాలరాజు తదితరులతో కలసి ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్థి రామ్నాథ్ కోవింద్ను కలిశారు. అనంతరం లక్ష్మణ్ ఏపీ భవన్లో మీడియాతో మాట్లాడారు. ఈనెల 4వ తేదీన రాష్ట్రపతి అభ్యర్థి రామ్నాథ్ కోవింద్ హైదరాబాద్ రానున్నారని తెలిపారు.
ఈ పర్యటన సందర్భంగా తొలుత ఆయన బీజేపీ ఎమ్మెల్యేలు, టీడీపీ, వైఎస్సార్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కలుస్తారని, అనంతరం ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో భేటీ అవుతారని లక్ష్మణ్ వెల్లడించారు. రాష్ట్రపతి ఎన్నికలో ఓడిపోతామని తెలిసీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని బరిలోకి దింపిందని అన్నారు. మీరాకుమార్ను రాష్ట్రపతిగా చేయాలనుకుంటే రెండు పర్యా యాలు అవకాశం ఉన్నా అప్పు డు ఎందుకు నిలబెట్టలేదని ప్రశ్నించారు. ఇప్పుడు ఓడి పోతామని తెలిసీ దళిత అభ్యర్థిని నిలిపారన్నారు. కాగా, సెప్టెంబర్ 10, 11, 12వ తేదీల్లో తమ పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్షా మరోసారి రాష్ట్రంలో పర్యటిస్తారని లక్ష్మణ్ వెల్లడించారు.
ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన.. తదితర పథకాలను రాష్ట్ర ప్రభుత్వం సమర్థంగా అమలుచేయడం లేదని విమర్శించారు. కేంద్ర ప్రభు త్వ పథకాలపై ఎక్కడా ప్రధాని మోదీ చిత్రం గానీ, కేంద్ర శాఖల బొమ్మలు గానీ లేకపోవడం దురదృష్ట కరమని లక్ష్మణ్ వ్యాఖ్యానించారు. ఓ ప్రశ్నకు బదు లిస్తూ ‘నియోజకవర్గాల పునర్విభజనను మేం వ్యతిరేకించడం లేదు. కానీ పార్టీ ఫిరాయింపులకు పాల్పడిన వారితో రాజీనామా చేయించకుండా... వారిని సర్దుబాటు చేసేందుకు టీఆర్ఎస్ పునర్విభజన కావాలనడాన్ని తప్పుపడుతున్నాం’అని అన్నారు.