చిన్నారులపై అత్యాచారాలకు ఉరి శిక్ష!

21 Apr, 2018 01:54 IST|Sakshi

ఆర్డినెన్స్‌ తెచ్చే యోచనలో కేంద్రం

న్యూఢిల్లీ: 12 ఏళ్లలోపు వయస్సున్న చిన్నారులపై లైంగిక దాడులకు ఒడిగట్టే వారికి మరణ శిక్షను విధించేలా కేంద్రం ఆర్డినెన్స్‌ను తీసుకురాబోతున్నట్లు తెలుస్తోంది. ఈ ఆర్డినెన్స్‌ శనివారమే కేంద్ర మంత్రివర్గం ముందుకు వచ్చే అవకాశం ఉందని ఓ అధికారి చెప్పారు. యూపీ, కశ్మీర్‌లోని కఠువా సహా దేశంలోని వివిధ ప్రాంతాల్లో మైనర్‌ బాలికలపై పెరిగిపోతున్న అత్యాచారాలపై ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తుండటంతో కేంద్రం ఈ దిశగా నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం.

ఈ మేరకు పోక్సో (లైంగిక నేరాల నుంచి చిన్నారులకు రక్షణ) చట్టాన్ని సవరిస్తూ ఓ ఆర్డినెన్స్‌ను తీసుకురానుందని న్యాయ మంత్రిత్వ శాఖ అధికారి చెప్పారు. ప్రస్తుతం ఈ చట్టం కింద కేసు నమోదై దోషులుగా తేలిన వారికి  గరిష్టంగా జీవితకాలం జైలు శిక్ష విధించేలా నిబంధనలు ఉన్నాయి. అత్యాచారం కారణంగా మహిళ చనిపోయినా లేదా జీవచ్ఛవంగా మారిన సందర్భాల్లో దోషులకు మరణ శిక్ష విధించేలా ప్రభుత్వం చట్టం తెచ్చింది.

రేప్‌ బాధిత బంధువున్నారా మీకు?: సుప్రీం
ఉన్నావ్‌ అత్యాచార ఘటనపై వచ్చిన ప్రజాహిత వ్యాజ్యం విచారణ సందర్భంగా ఓ న్యాయవాదిపై సుప్రీంకోర్టు శుక్రవారం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ‘క్రిమినల్‌ కేసుల్లో ప్రజాహిత వ్యాజ్యం ఎలా వేస్తారు? అత్యాచారానికి గురైన బంధువున్నారా మీకు?. ఉదారంగా ఉండకండి’ అంటూ ఎంఎల్‌ శర్మ అనే న్యాయవాదిపై సుప్రీం ధర్మాసనం ఆగ్రహం వ్యక్తంచేసింది.

మరిన్ని వార్తలు