సాక్షి,న్యూఢిల్లీ: రాబర్ట్ వాద్రా, వీరభద్రసింగ్లా తాను రాజకీయ బాధితుడినని లిక్కర్ కింగ్ విజయ్ మాల్యా చేసిన వ్యాఖ్యలపై వాద్రా స్పందించారు. తాను ఇతరుల సొమ్ముతో ఉడాయించలేదని, తన పేరును అనవసరంగా ఉపయోగించవద్దని మాల్యాకు వాద్రా సూచించారు. తన కేసు నుంచి దృష్టి మరల్చేందుకు మాల్యా బ్రిటన్ కోర్టులో తన పేరు ప్రస్తావించడంపై మండిపడుతూ వాద్రా ట్వీట్ చేశారు. మాల్యా దయచేసి భారత్కు తిరిగి వచ్చి న్యాయపరమైన వ్యవహారాలను ఎదుర్కోవాలని, బకాయిలు తిరిగి చెల్లించాలని సూచించారు.
తన పేరును ఎక్కడ ప్రస్తావించవద్దని, తనకు ఏ విషయంలోనూ మీతో (మాల్యా) పోలిక లేదని వాద్రా స్పష్టం చేశారు. తాను రాజకీయ బాధితుడే అయినా తన హోదాను ఎన్నడూ దుర్వినియోగం చేయలేదని, అంతకుమించి వేరొకరి సొమ్ముతో భారత్ నుంచి పారిపోలేదని అన్నారు. మాల్యా అప్పగింత కేసులో బ్రిటన్ కోర్టులో మాల్యా తన వాదన వినిపిస్తూ సోనియా అల్లుడు రాబర్ట్ వాద్రా, హిమాచల్ సీఎం వీరభద్రసింగ్ల మాదిరిగా కక్ష సాధింపు చర్యలకు తనను భారత ప్రభుత్వం టార్గెట్ చేసిందని ఆరోపించారు.