డబ్బులు తీసుకుని పాత ఆయుధాలిచ్చారు

15 Dec, 2019 03:36 IST|Sakshi

చండీగఢ్‌: రెండు దశాబ్దాల క్రితం కార్గిల్‌ యుద్ధ సమయంలో ఆకస్మిక సైనిక అవసరాలను తీర్చడానికి అవసరమైన ఉపగ్రహ చిత్రాలు, ఆయుధాలు, మందుగుండు సామగ్రి కోసం కొన్ని దేశాలు భారత్‌ నుంచి అధిక చార్జీలు వసూలు చేశాయని రిటైర్డ్‌ ఆర్మీ చీఫ్‌ వీపీ మాలిక్‌ పేర్కొన్నారు. కార్గిల్‌ యుద్ధ సమయంలో వీపీ మాలిక్‌ భారత సైన్యానికి నాయకత్వం వహించారు. మిలిటరీ లిటరేచర్‌ ఫెస్టివల్‌లో ‘మేక్‌ ఇన్‌ ఇండియా అండ్‌ ది నేషన్స్‌ సెక్యూరిటీ’పై చర్చాగోష్టిలో ఆయన మాట్లాడారు.

‘కార్గిల్‌ యుద్ధ సమయంలో ఇతర దేశాల నుంచి అత్యవసరమైన ఆయుధాల కొనుగోళ్లలో వారు మమ్మల్ని దోపిడీ చేశారు. మేము తుపాకుల కోసం ఒక దేశాన్ని సంప్రదించినప్పుడు వారు మొదట్లో ఇస్తామని చెప్పారు. ఆ తర్వాత పాత ఆయుధాలను ఆధునీకరించి సరఫరా చేశారు. మందుగుండు సామగ్రి కోసం మరొక దేశాన్ని సంప్రదించినప్పుడు 1970 నాటి పాతకాలపు మందుగుండు సామగ్రిని ఇచ్చారు’అని తెలిపారు. అలాగే కార్గిల్‌ సమయంలో భారతదేశం కొనుగోలు చేసిన ప్రతి ఉపగ్రహ చిత్రానికి రూ.36 వేలు చెల్లించాల్సి వచ్చిందని, ఆ చిత్రాలు కూడా తాజావి కావని, మూడేళ్ల క్రితం చిత్రాలని  వీపీ మాలిక్‌ పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు