పాక్‌ క్రికెటర్‌ చేష్టలు.. భగ్గుమన్న భారత సైన్యం

22 Apr, 2018 13:37 IST|Sakshi
బీటింగ్ రిట్రీట్ మధ్యలో హసన్‌ అలీ

సాక్షి, న్యూఢిల్లీ : పాక్‌ యువ క్రికెటర్‌ హసన్‌ అలీపై భారత సైన్యం ఆగ్రహంతో ఊగిపోతోంది. అట్టరీ-వాఘా సరిహద్దులో భారత్‌-పాక్‌ దళాల బీటింగ్ రిట్రీట్ సమయంలో హసన్‌ చేసిన నిర్వాకమే ఇందుకు కారణం. ప్రొటోకాల్‌ ప్రకారం భారత్‌ తరపున బీఎస్‌ఎఫ్‌.. పాక్‌ తరపున రేంజర్లు రెచ్చగొట్టే సంజ్ఞలతో అక్కడ హాజరయ్యే ఇరు దేశాల ప్రజలను అలరిస్తుంటారు. ఆనవాయితీగా జరిగే ఈ ప్రదర్శన మధ్యలో ఎవరూ రావటానికి వీల్లేదు. 

కానీ, పాక్‌ క్రికెటర్‌ హసన్‌ మాత్రం అత్యుత్సాహం ప్రదర్శించాడు. గ్యాలరీ నుంచి లేచి వచ్చి పరుగు పరుగున మధ్యలో నిల్చుని వికెట్లు తీసే సమయంలో చేసే తన మార్క్‌ సంజ్ఞను ప్రదర్శించాడు. అయితే ఈ క్రమంలో అతను బీఎస్‌ఎఫ్‌ దళాలు, భారతీయుల ప్రేక్షకుల గ్యాలరీ వైపు చూస్తూ రెచ్చగొట్టే చేష్టలు చేశాడు. ఈ చర్యలపై భారత సైన్యం ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ‘ఇలాంటి చర్యలను మేం ఉపేక్షించబోం. పెరేడ్‌ తర్వాత ఎవరూ ఇలాంటి చేష్టలు చేసినా మేం పట్టించుకునేవాళ్లం కాదు. కానీ, మధ్యలో వచ్చి ఇలా రెచ్చిపోవటం ముమ్మాటికీ ఖండించదగ్గ అంశమే. ఈ మేరకు హసన్‌తో క్షమాపణలు చెప్పించాలని.. ఘటనపై పూర్తి వివరణ ఇవ్వాలని పాక్‌ సైన్యానికి లేఖ రాశాం’ అని బీఎస్‌ఎఫ్‌ అధికారి ఒకరు తెలిపారు.  అఫ్రిది.. నువ్వు ఎక్కడ పుట్టావ్‌?

అయితే పాక్‌ సైన్యం మాత్రం ఈ వ్యవహారంపై ఇప్పటిదాకా నోరు మెదపలేదు. మరోపక్క పాకిస్థాన్‌ క్రికెట్‌ బోర్డు శనివారం తమ ఆటగాళ్లు వాఘాను సందర్శించిన ఫోటోలను ట్వీటర్‌లో పోస్టు చేయగా.. డాన్‌ పత్రిక హసన్‌ చేసిన పనిని కొనియాడుతూ ఓ కథనం ప్రచురించింది.

బీటింగ్ రిట్రీట్ గురించి...
ఈ కార్యక్రమం ప్రతిరోజూ సాయంత్రం సూర్యాస్తమయానికి రెండు గంటలముందు జరుగుతుంది. 1959నుండి ఈ ఆనవాయితీ కొనసాగుతూ వస్తోంది. భారతదేశానికి చెందిన సరిహద్దు భద్రతా దళం (బీఎస్‌ఎఫ్‌) సైనికులు, పాకిస్తాన్‌కు చెందిన పాకిస్తాన్ రేంజర్స్ సైనికులు కలిసి ఈ కవాతును నిర్వహిస్తారు. సూర్యాస్తమయానికి సరిగ్గా వారి దేశ పతాకాలను క్రిందకు దించి పరస్పరం కరచాలనం చేసుకుని వెనుదిరుగుతారు. ఈ కవాతును బీటింగ్ రిట్రీట్ అని పిలుస్తారు. ఈ గగుర్పొడిచే కార్యక్రమాన్ని ఇరుదేశాల పౌరులు ఉత్సాహంగా తిలకిస్తారు. ఇరుదేశాల ప్రజలలో దేశభక్తిని పెంపొందించే ఈ కవాతు ప్రతికూల పరిస్థితులలో కూడా నిరాటంకంగా జరుగుతుంది.

మరిన్ని వార్తలు