చొరబాటు ప్రయత్నం.. ముగ్గురు ఉగ్రవాదులు హతం

1 Jun, 2020 13:08 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

శ్రీనగర్‌ : జమ్మూ కాశ్మీర్‌లోని రాజౌరి జిల్లా సరిహద్దు వెంబడి అక్రమ చొరబాటులను భారత్‌ సైన్యం సమర్థవంతంగా తిప్పికొట్టింది. సోమవారం నియంత్రణ రేఖ వెంబడి భారత్‌లోకి చొరబడేందుకు యత్నించిన ముగ్గురు ఉగ్రవాదులను సైనికులు హతమార్చారు. పాకిస్తాన్‌ ఆక్రమిత జమ్మూ కశ్మీర్‌ నుంచి ఉగ్రవాదులు భారత్‌లోకి ప్రవేశించే అవకాశం ఉందని సమాచారం అందుకున్న అధికారులు సంబంధిత ప్రాంతాల్లో సెర్చ్‌ ఆపరేషన్‌ చేపట్టారు. ఈ నేపథ్యంలో సోమవారం తెల్లవారు జామున జమ్మూ కాశ్మీర్‌, రాజౌరి జిల్లాలోని నౌషీరా సెక్టార్‌లో అక్రమ చొరబాటుకు యత్నిస్తున్న ఉగ్రవాదులపై భారత సైన్యం కాల్పులు జరిపింది. ఈ కాల్పుల్లో ముగ్గురు ఉగ్రవాదులు మరణించారు. (కేంద్ర కేబినెట్‌ కీలక భేటీ.. చరిత్రాత్మక నిర్ణయాలు?)

దీనిపై ఓ ఆర్మీ అధికారి మాట్లాడుతూ.. మే 28నుంచి సెర్చ్‌ ఆపరేషన్‌ మొదలుపెట్టామని, ఈ ఉదయం భారత భూభాగంలోకి ప్రవేశించాలని చూసిన ఉగ్రవాదులను అడ్డుకున్నామని తెలిపారు. రాజౌరి, పూంచ్ జిల్లాలోని ఆరు గ్రామాల్లో సెర్చ్‌ ఆపరేషన్ ప్రారంభించినట్లు పేర్కొన్నారు. జమ్మూ కాశ్మీర్‌లోని కథువా-సాంబా సెక్టార్‌లోని హిరానగర్ ప్రాంతంలో బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్‌తోపాటు(బీఎస్‌ఎఫ్) పోలీసులు కూడా ప్రత్యేక సెర్చ్‌ ఆపరేషన్ ప్రారంభించినట్లు వె‍ల్లడించారు. (తుపాకులు గర్జిస్తాయి: ట్రంప్‌ )

>
మరిన్ని వార్తలు