గోడ దూకిన గవర్నర్‌

27 Oct, 2017 10:58 IST|Sakshi

సాక్షి, చెన్నై : ధైర్య సాహసాలకు మరోపేరైన పుదుచ్చేరి లెఫ్టినెంట్‌ గవర్నర్‌ కిరణ్‌ బేడి మరో సాహసం చేశారు. గురువారం ఆమె కరైకల్‌ ప్రాం‍తంలో పర్యటించారు. ఈ సమయంలోనే  అక్కడి ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించారు. ఆసుపత్రిలోని సౌకర్యాలు, రోగులకు అందుతున్న సదుపాయాల గురించి అక్కడివారిని అడిగి తెలుసుకున్నారు. పారిశుద్ధ్య పరిస్థితులు సరిగ్గా లేకపోవడంతో.. ఆమె అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఆసుపత్రి ప్రాంగణంలో ప్రత్యేకంగా ఉన్న ‘అవర్‌ లేడీ ఆఫ్‌ లార్డ్స్‌‘  గదిని గమనించారు. ఆ గదికి చుట్టూ 4 అడుగుల మేర ఇటుక గోడ నిర్మించి ఒక గేట్‌ పెట్టారు. అవర్‌ లేడీ ఆఫ్‌ లార్డ్స్‌ గదిని సందర్శించాలని కిరణ్‌ బేడీ ఆసుపత్రి అధికారులకు తెలిపారు. గేట్‌ చాలాకాలం పాటు మూసివుంచడంతో.. తాళం చెవులు ఎక్కడపెట్టారో అధికారులు మర్చిపోయారు.

కొద్దిసేపు తాళం చెవుల కోసం ఎదురు చూసిన కిరణ్‌ బేడి.. చివరకు గోడను ఎక్కి అవతలకు దూకి షెడ్‌లోకి వెళ్లారు. దీంతో చేసేదీలేక.. కరైకల్‌ కలెక్టర్‌ ఆర్‌. కేశవన్‌, సీనియర్‌ సూపరింటెండెంట్‌ ఆఫ్‌ పోలీస్‌ వీజే చంద్రన్‌, మరికొందరు అధికారులు కూడా గోడ దూకి షెడ్‌లోకి వెళ్లారు.

మరిన్ని వార్తలు