‘ఈ సమయంలో ఎన్నికల వాయిదా సరైనది కాదు’

17 Mar, 2020 14:31 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేష్‌ కుమార్‌ స్థానిక ఎన్నికలు ఏకపక్షంగా వాయిదా వేయడం సరికాదని వైఎస్సార్‌సీపీ ఎంపీ లావు శ్రీకృష్ణదేవారాయలు వ్యాఖ్యానించారు. మంగళవారం లోక్‌సభలో జీరో అవర్‌లో ఎంపీ మాట్లాడుతూ.. ఎన్నికల కమిషనర్‌ ప్రభుత్వ యంత్రాంగాన్ని సంప్రదించలేదని అన్నారు. ఎన్నికల కమిషన్‌ ఏకపక్ష నిర్ణయం తీసుకుందని తెలిపారు. రాష్ట్రంలో ఎన్నికల ప్రక్రియ అంతా పూర్తి చేశారని. జిల్లా కలెక్టర్లు యంత్రాంగాన్ని సిద్ధం చేసి ఉంచారని.. ఇలాంటి సమయంలో ఎన్నికలు వాయిదా వేయటం సరైన చర్య కాదని పేర్కొన్నారు.

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం కరోనా వైరస్‌ నియంత్రణకు ప్రత్యేక చర్యలు తీసుకుందని, వ్యాధి వ్యాప్తి రేటు చాలా తక్కువగా ఉందని చెప్పారు. మూడు, నాలుగు వారాలపాటు వ్యాప్తి అదుపులో ఉంటుందని, ఈలోపు తగిన ఏర్పాట్లు రాష్ట్ర ప్రభుత్వం చేస్తుందని వివరించారు. రాష్ట్రంలో ఏకపక్షంగా స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదా వేయడం వలన రాష్ట్రానికి రావాల్సిన 14వ ఆర్థిక సంఘం నిధులు రూ. 5100 కోట్లు ఆగిపోయే పరిస్థితి ఉందని తెలిపారు. 

మరిన్ని వార్తలు