విదేశాల్లో భారత నేతలను గెలిపించాలి: యార్లగడ్డ

4 Jun, 2018 01:51 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: అమెరికా రాజకీయాల్లో చురుగ్గా ఉన్న భారతీయులకు చేయూతనిచ్చి వారిని సెనెటర్లుగా, కాంగ్రెస్‌మెన్లుగా గెలిపించినప్పుడే భారతీయుల గర్జన ప్రపంచమంతా వినిపిస్తుందని కేంద్రీయ హిందీ సమితి సభ్యుడు యార్లగడ్డ లక్ష్మీప్రసాద్‌ అన్నారు. అమెరికాలో జరిగిన తెలుగు మహాసభల ముగింపు కార్యక్రమంలో అమెరికా తెలుగు సంఘం (ఆటా), తెలంగాణ తెలుగు సంఘం (టాటా) సంయుక్తంగా యార్లగడ్డకు జీవితకాల సాఫల్య పురస్కారాన్ని ప్రదానం చేశాయి.

ఈ సందర్భంగా యార్లగడ్డ మాట్లాడుతూ.. రాజా కృష్ణమూర్తి, అరుణా మిల్లర్, చివుకుల ఉపేంద్ర వంటి ఇండో–అమెరికన్‌ రాజకీయవేత్తలకు అమెరికాలోని తెలుగు ప్రజలు చేయూతనివ్వాలని కోరారు. ఎన్టీఆర్‌ తెలుగు భాష కోసం ప్రాణమిచ్చారని, దివంగత వైఎస్‌ రాజశేఖరరెడ్డి తెలుగుకు ప్రాచీన హోదా కోసం కృషి చేశారని గుర్తు చేశారు. సంస్కృతిని కాపాడుకునేందుకు కావాల్సింది సఖ్యత అని ఆటా–టాటా సంస్థలు చాటి చెప్పాయన్నారు. కార్యక్రమంలో ఆటా అధ్యక్షుడు ఆసిరెడ్డి కరుణాకర్, టాటా అధ్యక్షుడు హరనాథ్‌ పొలిచెర్ల తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు