కొత్తజంటకు పోలీసుల వైరైటీ రిసెప్షన్‌

4 May, 2020 11:28 IST|Sakshi

ముంబై: లాక్‌డౌన్‌ నిబంధనలు పాటిస్తూ తమ ఇంట్లో పెళ్లి చేసుకున్న ఓ జంటకు నాసిక్‌ పోలీసులు తమదైన శైలిలో శుభాకాంక్షలు తెలిపారు. బాల్కనీలో నూతన వధూవరులు నిలబడి ఉండగా.. చప్పట్లతో వారిని అభినందిస్తూ.. బాలీవుడ్‌ పాటలు ప్లే చేశారు. ఈ ఘటన మహారాష్ట్రలో చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించిన వీడియోను సీఎంఓ మహారాష్ట్ర ఇన్‌స్టా అకౌంట్‌లో షేర్‌ చేయగా నెటిజన్ల ప్రశంసలు అందుకుంటోంది. కాగా కరోనా కట్టడి చర్యల్లో భాగంగా లాక్‌డౌన్‌ అమల్లో ఉన్న నేపథ్యంలో పెళ్లిళ్లు సహా ఇతర శుభకార్యాలు వాయిదా పడిన సంగతి తెలిసిందే.

ఈ క్రమంలో కొంతమంది నిరాడంబరంగా పెళ్లి తంతు పూర్తి చేసుకుంటుండగా.. మరికొన్ని చోట్ల పోలీసులే పెళ్లి పెద్దలుగా వ్యవహరిస్తున్నారు. పుణెలోని ఓ అసిస్టెంట్‌ పోలీసు ఇన్‌స్పెక్టర్‌ దంపతులు.. వధువు తల్లిదండ్రులుగా వ్యవహరించి కన్యాదానం చేసిన విషయం తెలిసిందే. ఇక మహారాష్ట్రలో ఇప్పటి వరకు దాదాపు 13 వేల మంది కరోనా బారిన పడగా.. 548 కరోనా మరణాలు సంభవించాయి. ఇదిలా ఉండగా దేశవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య 40 వేలు దాటగా... 1300 మంది మరణించారు.(లాక్‌డౌన్‌ : పోలీసులే కన్యాదానం చేశారు..)

మరిన్ని వార్తలు