ఎందుకు ‘మహా’ రైతులు కన్నెర్ర చేస్తున్నారు?

11 Mar, 2018 08:48 IST|Sakshi

ఫడ్నవిస్‌ సర్కార్‌పై రైతుల కన్నెర్ర

12న అసెంబ్లీ ముట్టడి 

సాక్షి, ముంబై: మహారాష్ట్రలో రైతన్నలు రోడ్డెక్కారు.  నాసిక్‌ నుంచి ముంబై వరకు లాంగ్‌ మార్చ్‌ నిర్వహిస్తున్నారు. ఈనెల 12న ముంబైలో అసెంబ్లీ ముట్టడికి సన్నాహాలు చేస్తున్నారు. అన్నదాతల ఆక్రందనలకు కారణాలేంటి ?  ఎందుకు రైతులు ఫడ్నవీస్‌ సర్కార్‌పై కన్నెర్ర చేస్తున్నారు ?  

ఏమిటీ మార్చ్‌ 
భారతీయ కిసాన్‌ సభ ఆధ్వర్యంలో 30 వేల మంది రైతులతో మార్చి 6న నాసిక్‌లో మహా పాదయాత్ర మొదలైంది. మొత్తం 180 కిలోమీటర్లు సాగే ఈ యాత్ర ఆదివారం ముంబై చేరుకుంటుంది. 12న జరగనున్న అసెంబ్లీ ముట్టడిలో 70 వేల మందివరకు రైతులు పాల్గొంటారని అంచనాలున్నాయి. ముంబై  ఆగ్రా జాతీయరహదారి మీదుగా ఈ లాంగ్‌ మార్చ్‌ కొనసాగుతోంది. వేలాది మంది రైతులు రోడ్లపైనే తింటున్నారు.. ఎక్కడ కాస్త జాగా కనిపిస్తే అక్కడే నిద్రపోతున్నారు. తమ డిమాండ్లు తీర్చాలంటూ నినదిస్తున్నారు. ఈ మహా పాదయాత్రలో మహిళా రైతులు, 90 ఏళ్ల పై బడిన వృద్ధులు కూడా ఉన్నారు. 

ఎందుకీ పాదయాత్ర 
ఈ ఏడాది అకాల వర్షాలు రైతన్నలను నిండా ముంచేశాయి. వడగండ్ల వానలు కడగండ్లను మిగిల్చాయి. పింక్‌ బాల్‌ వార్మ్‌ పత్తి రైతుల్ని  పీల్చిపిప్పి చేసింది. ఫిబ్రవరిలో కురిసిన వడగళ్లవానలకు లక్షలాది ఎకరాల్లో పంట నష్టం జరిగింది. మొత్తం 19 జిల్లాల్లో రబీ పంట తుడిచిపెట్టుకుపోయింది.  అమరావతి, మరఠ్వాడ, నాగపూర్, నాసిక్‌ ప్రాంతాల్లో రైతులు దారుణంగా నష్టపోయారు. ఇక మహారాష్ట్రలో గత ఏడాది 84 శాతం వ్యవసాయ భూముల్లో పత్తి పంట సాగు చేశారు. అయితే ఈ పంటకు  సోకిన పింక్‌ బాల్‌ వార్మ్‌ కారణంగారైతులు తీవ్రంగా నష్టపోయారు. అప్పుల్లో కూరుకుపోయారు. ఆదుకోవాల్సిన ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు చూస్తూ ఉంది.. గత ఏడాది మహారాష్ట్ర సర్కార్‌ 34 వేల కోట్ల రైతు రుణాల మాఫీకి హామీ ఇచ్చింది. కానీ అమలు సరిగా జరగలేదు. దీంతో అన్నదాతల్లో  ఆగ్రహం కట్టలు తెంచుకుంది. తమ సమస్యల తీరేవరకు పోరాటాన్ని కొనసాగిస్తామని  అన్నదాతలు హెచ్చరిస్తున్నారు. 

రైతులు చేస్తున్న డిమాండ్లు ఏంటి ?

ఫడ్నవీస్‌ సర్కార్‌ ఇచ్చిన మాట నిలబెట్టుకొని రైతు రుణాలన్నీ మాఫీ చేయాలి.
విద్యుత్‌ బిల్లుల్ని రద్దు చేయాలి.
స్వామినాథన్‌ కమిటీ సిఫారసులన్నీ అమలు చేయాలి
కనీస మద్దతు ధరతో రైతులకు ఒదిగేదేమీ లేదు. చట్టబద్ధమైన ధరను కల్పించాలి. 
అకాల వర్షాలు, పింక్‌ బాల్‌ వార్మ్‌ కారణంగా పంట నష్టపోయిన రైతులకు నష్టపరిహారం పెంచాలి.
బుల్లెట్‌ రైళ్లు, సూపర్‌హైవేలు వంటి అభివృద్ధి ప్రాజెక్టుల పేరుతో పంటభూముల్ని బలవంతంగా స్వాధీనం చేసుకోవడాన్ని నిలిపివేయాలి. 
ఆదివాసీలకు అటవీ భూములపై యాజమాన్య హక్కులు కల్పించాలి. 
నాసిక్, థానే, పాల్‌ఘడ్‌ ప్రాంతాలను కలుపుతూ ప్రతిపాదించిన నదుల అనుసంధానం ప్రాజెక్టు కారణంగా ఎన్నో ఆదివాసీ గ్రామాలు నష్టపోతాయి.. అందుకే ఆ రూట్‌ మ్యాప్‌ను మార్చాలి. 

ఆగని అన్నదాతల ఆత్మహత్యలు 
రైతు సమస్యల పరిష్కారానికి గత ఏడాది ప్రభుత్వం రుణ మాఫీని ప్రకటించినా ఎలాంటి ప్రయోజనం కనిపించలేదు. క్షేత్రస్థాయిలో దీని అమలు జరగలేదు. దీంతో అన్నదాతల ఆత్మహత్యలు ఆగలేదు. గత ఏడాది జూన్‌ నుంచి ఇప్పటి వరకు 1753 మంది రైతన్నలు బలవన్మరణానికి పాల్పడ్డారు. విదర్భ, మరఠ్వాడ, నాసిక్‌ ప్రాంతాల్లో ఎక్కువ మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. 

చేసేదంతా చేస్తున్నాం: సర్కార్‌
మరోవైపు మహారాష్ట్ర సర్కార్‌ రైతులకు చేయాల్సినదంతా చేస్తున్నామని చెబుతోంది. 35 లక్షల 68 వేల మంది రైతులకు లబ్ధి చేకూరేలా రుణమాఫీ పథకం కింద ఇప్పటివరకు 13, 782 కోట్లు నిధులు విడుదల చేశామని చెబుతోంది. అంతేకాదు ఈ ఏడాది బడ్జెట్‌లో వ్యవసాయ రంగానికే అత్యంత ప్రాధాన్యతనిస్తూ 15వేల కోట్ల రూపాయలను కేటాయించారు. రైతు సమస్యల పరిష్కారానికి కేంద్రం నుంచి 2,400 కోట్ల రూపాయల ఆర్థిక సాయాన్ని కూడా ప్రభుత్వం కోరింది. . అయితే ఇప్పటివరకు కేంద్రం నుంచి ఎలాంటి సాయం అందలేదు.

   -(సాక్షి నాలెడ్జ్‌ సెంటర్‌)

మరిన్ని వార్తలు