జైలు లాక్‌డౌన్‌లో ఉన్నా ఖైదీలకు కరోనా!

8 May, 2020 19:04 IST|Sakshi

పాలు, కూరగాయల విక్రేతలే వైరస్‌ వాహకులు

ముంబై : దేశ ఆర్థిక రాజధాని ముంబైలోని ఆర్థర్‌ రోడ్‌ సెంట్రల్‌ జైలులో 77 మంది ఖైదీలు సహా అక్కడ విధులు నిర్వహిస్తున్న 26 మంది పోలీసు సిబ్బందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ కావడంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. వైరస్‌ వ్యాప్తి చెందుతున్న క్రమంలో జైలును పూర్తిగా లాక్‌డౌన్‌లో ఉంచామని అయినా మహమ్మారి విజృంభించడంపై ఆరా తీస్తున్నామని మహారాష్ట్ర హోంమంత్రి అనిల్‌ దేశ్‌ముఖ్‌ పేర్కొన్నారు. జైలుకు కూరగాయలు, పాలు సరఫరా చేసే వారి ద్వారా వైరస్‌ సంక్రమించిందని భావిస్తున్నామని అన్నారు.

అర్థర్‌ రోడ్‌ జైల్‌ సహా 8 జైళ్లను పూర్తిగా లాక్‌డౌన్‌ చేశామని, అయితే కూరగాయుల, పాలు సరఫరా చేసే వారు కోవిడ్‌-19 వాహకులుగా మారవచ్చని వ్యాఖ్యానించారు. కరోనా పాజిటివ్‌గా తేలిన వారికి దక్షిణ ముంబైలోని ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే సెయింట్‌ జార్జ్‌ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. ముంబై నగరంలో పెద్ద సంఖ్యలో పోలీసులు మహమ్మారి బారినపడటంతో వారిలో నైతిక స్థైర్యం నింపేందుకు ముంబై నగర పోలీస్‌ కమిషనర్‌ పరం వీర్‌ సింగ్‌ జేజే మార్గ్‌ పోలీస్‌ స్టేషన్‌ను సందర్శించి అక్కడి సిబ్బందిని ఉత్తేజపరిచారు.

చదవండి : శవాలు తీసుకువెళ్లడం లేదు.. అందుకే ఇలా

>
మరిన్ని వార్తలు