నోరు జారిన మమతా బెనర్జీ

16 Oct, 2019 20:14 IST|Sakshi

కోల్‌కతా : పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నోరు జారారు. ప్రతిష్టాత్మక నోబెల్‌ పురస్కారం అందుకున్న అభిజిత్‌ బెనర్జీ పేరును తప్పుగా ఉచ్ఛరించారు. ఇలా ఒకటికి రెండుసార్లు ఆమె అభిజిత్‌ పేరును అభిషేక్‌ బాబు అని పలికారు. అయితే అభిషేక్‌ అనేది మమతా బెనర్జీ మేనల్లుడి పేరు అన్న సంగతి తెలిసిందే. ముఖ్యమంత్రి హోదాలో ఉండి.. అంతర్జాతీయ స్థాయిలో ప్రతిష్టాత్మక పురస్కారం అందుకున్న వ్యక్తి పదేపదే తప్పుగా పలుకడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

మమత మీడియాతో మాట్లాడుతూ.. ‘బెంగాల్‌ నుంచి అమర్త్యసేన్‌‌, మదర్‌థెరీసా నోబెల్‌ పురస్కారం అందుకున్నారు. తాజాగా అభిషేక్‌ బాబును నోబెల్‌ బహుమతి వరించింది. ఇది బెంగాల్‌కు గర్వకారణం. అభిషేక్‌ బాబు తల్లి కోల్‌కతాలోనే ఉంటారు. నేను ఈ రోజు ఆమెను కలవడానికి వెళ్తున్నాన’ని తెలిపారు. అలాగే బీసీసీఐ అధ్యక్షుడిగా నియామకం ఖాయమైన టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్‌ గంగూలీని మమత ప్రశంసలతో ముంచెత్తారు. గంగూలీ తమ కుటుంబ సభ్యుడి లాంటి వాడని పేర్కొన్నారు. మంగళవారం రోజున గంగూలీతో మాట్లాడనని.. దుర్గా పూజకు ముందు అతను తనను కలవడానికి వచ్చాడని వెల్లడించారు. మరోవైపు బుధవారం సాయంత్రం మమత కోల్‌కతాలో ఉన్న అభిజిత్‌ కుటుంబ సభ్యులను కలిశారు.

మరిన్ని వార్తలు