అసభ్యకర ఫొటోలు తీసిన వ్యక్తి అరెస్ట్!

23 Apr, 2016 15:25 IST|Sakshi
అసభ్యకర ఫొటోలు తీసిన వ్యక్తి అరెస్ట్!

న్యూఢిల్లీ: తోటి ప్రయాణీకురాలిపై వేధింపులకు పాల్పడిన వ్యక్తిని ఢిల్లీ ఎయిర్ పోర్ట్ పోలీసులు అరెస్టు చేశారు. విమాన ప్రయాణంలో మహిళను అసభ్యకర ఫొటోలు తీసిన వ్యక్తి కటకటాలపాలయ్యాడు. అహ్మదాబాద్ నుంచి ఢిల్లీ బయల్దేరిన విమానంలో తనతోపాటు ప్రయాణిస్తున్న మహిళను కెమెరాలో అసభ్యంగా చిత్రీకరించి వివాదంలో ఇరుక్కున్నాడు. విమానం ఢిల్లీ ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టుకు  చేరుకున్న తర్వాత మహిళ ఫిర్యాదు మేరకు నిందితుడు గౌరవ్ శర్మను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

మహిళను అసభ్యంగా ఫొటోలు తీసిన గౌరవ్ శర్మ  చిక్కుల్లో పడ్డాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు అహ్మదాబాద్ నుంచి విమానం ఢిల్లీకి చేరుకున్న తర్వాత నిందితుడు గౌరవ్ శర్మను అదుపులోకి తీసుకున్న పోలీసులు... అతడిపై ఐపీసీ సెక్షన్ 354C కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు డీసీపీ డికె. గుప్తా తెలిపారు. బాధిత మహిళ స్వస్థలం అహ్మదాబాద్ కాగా, నిందితుడు  ఉత్తర ప్రదేశ్ లోని సంభాల్ వాసిగా తెలుస్తోంది.

గత రెండు మూడురోజుల్లోనే విమాన ప్రయాణంలో మహిళలపై లైంగిక వేధింపులకు పాల్పడటం ఇది రెండోసారి. రెండ్రోజుల క్రితం కోల్ కత్తా నుంచి ముంబై వెడుతున్న ఇండిగో 6E 326 విమానంలో బంగ్లాదేశ్ కు చెందిన వ్యక్తి...  ఎయిర్ హోస్టెస్ పట్ల అసభ్యంగా ప్రవర్తించడంతో అతడ్ని అరెస్టు చేశారు. బంగ్లాదేశ్ కు చెందిన 38 ఏళ్ళ అషిమ్ భూమిక్ ను అరెస్టు చేసినట్లు ఛత్రపతి శివాజీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ డీసీపీ వీరేంద్ర మిశ్రా తెలిపారు.

మరిన్ని వార్తలు