Delhi: ఇకపై 83 షాపులు 24 గంటలు ఓపెన్‌!

21 Nov, 2023 12:39 IST|Sakshi

దిల్లీ ప్రభుత్వం ఆర్థికంగా బలంగా మారడానికి చర్యలు ప్రారంభించింది. అందులో భాగంగా దుకాణాలను 24 గంటలు తెరిచి ఉంచడం ద్వారా ప్రభుత్వ ఖజానాకు కొంత సొమ్ము జమవుతుందని భావిస్తోంది. తాజాగా ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ నగరంలో 83 దుకాణాలు, వాణిజ్య సంస్థలకు 24 గంటలు పనిచేయడానికి అనుమతి ఇచ్చారు.  దీంతో దిల్లీలో 24 గంటలపాటు తెరిచి ఉంచే దుకాణాల సంఖ్య 635కు చేరింది.

ఈ మేరకు దిల్లీ ప్రభుత్వ షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్‌మెంట్ కమిటీ (ఎస్‌ఈసీ) నిర్ణయం తీసుకుంది. కమిటీకి మొత్తం 122 దరఖాస్తు వచ్చాయి. కానీ సరైన వివరాలు వెల్లడించని కారణంగా 29 దరఖాస్తులను తిరస్కరించినట్లు అధికారులు తెలిపారు. నిర్దిష్ట ప్రదేశాల్లోని దుకాణాలను ఎంపిక చేసి అనుమతించినట్లు చెప్పారు. చట్టంలోని నిబంధనలు ఉల్లంఘిస్తే భారీ జరిమానాలు తప్పవని హెచ్చరించారు. 

దుకాణాలు, వాణిజ్య సంస్థలు 24 గంటలు పనిచేయడంతో నగర ఆర్థిక వ్యవస్థ మెరుగవుతుందని ప్రభుత్వం అభిప్రాయపడుతుంది. దాంతోపాటు మరింత మందికి ఉపాధి అవకాశాలు ఏర్పడతాయి. ఎక్కువ మంది పర్యాటకులను ఆకర్షించేలా ఈ నిర్ణయం సహకరిస్తుందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.

మరిన్ని వార్తలు