‘వాజ్‌పేయికి నివాళి అర్పించను’.. రచ్చ రచ్చ!

17 Aug, 2018 19:30 IST|Sakshi

సాక్షి, ముంబై, ఔరంగాబాద్‌ : మాజీ ప్రధాని, బీజేపీ అగ్రనేత అటల్‌ బిహారీ వాజ్‌పేయి సంతాప తీర్మానంను వ్యతిరేకించిన ఓ మజ్లిస్ ఇత్తెహాదుల్ ముస్లిమీన్‌ (ఎంఐఎం) కార్పొరేటర్‌పై బీజేపీ కార్పొరేటర్లు దాడి చేశారు. ఈ ఘటన మహారాష్ట్రలోని ఔరంగాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్ సమావేశంలో చోటుచేసుకుంది. వాజ్‌పేయి మృతికి సంతాపంగా మున్సిపల్‌ కార్పొరేషన్‌ సభ్యులందరూ నివాళి అర్పించేందుకు శుక్రవారం సర్వసభ్య సమావేశం నిర్వహించారు.

ఈ సమావేశంలో వాజ్‌పేయి మృతికి సంతాపం వ్యక్తం చేయాలని బీజేపీ కార్పొరేటర్‌ రాజు విద్యా సంతాప తీర్మానం ‍ప్రవేశపెట్టారు. అతడు ప్రవేశపెట్టిన తీర్మానాన్ని ఎంఐఎం సభ్యుడు సయ్యద్‌ మటీన్‌ వ్యతిరేకించారు. దీంతో రగిలిపోయిన బీజేపీ సభ్యులు ఒక్కసారిగి అతనిపై దాడికి దిగి సయ్యద్‌ను చితకబాదారు. వెంటనే అక్కడున్న సిబ్బంది అప్రమత్తం కావడంతో వారి నుంచి సయ్యద్‌ తప్పించుకున్నారు. తీవ్ర గాయాలపాలైన మటీన్‌ను దగ్గరలోని ఆసుపత్రికి తరలించారు.

దీనిపై బీజేపీకి చెందిన ఓ నేత మాట్లాడుతూ... మాజీ ప్రధాని మృతికి సంతాపం వ్యక్తం చేయవల్సిందిగా తీర్మానం ప్రవేశపెడితే దానిని వ్యతిరేకించారని, గతంలో కూడా సభలో జాతీయ గీతం పాడటానికి అతను వ్యతిరేకించారని తెలిపారు. తమ సభ్యుడిపై దాడి చేశారన్న వార్తను తెలుసుకున్న స్థానిక ఎంఐఎం కార్యకర్తలు అక్కడున్న బీజేపీ నేతల కార్లను ధ్వంసం చేసి, కారు డ్రైవర్‌పై దాడికి పాల్పడ్డాడు. మటీన్‌పై దాడి చేసిన వీడియోలు ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి.

మరిన్ని వార్తలు