-

టీకా అభివృద్ధిపై ప్రధాని సమీక్ష 

6 May, 2020 02:30 IST|Sakshi

న్యూఢిల్లీ: దేశంలో కరోనా వైరస్‌ వ్యాక్సిన్‌ అభివృద్ధి, ఔషధ పరిశోధన, పరీక్షల విషయంలో జరుగుతున్న పురోగతిపై ప్రధాని మోదీ మంగళవారం సమీక్ష జరిపారు. విద్యావేత్తలు, ప్రభుత్వ, పారిశ్రామిక సంస్థల నిపుణులతో వ్యాక్సిన్‌ అభివృద్దిపై ఏర్పాటైన టాస్క్‌ఫోర్స్‌ సమావేశానికి ఆయన అధ్యక్షత వహించారు. ‘సంక్షోభ సమయాల్లో సుసాధ్యమైన విషయాలే రోజువారీ జీవనంలోనూ భాగంగా మారాలి’అని ఆయన అన్నారని ప్రభుత్వం ఒక ప్రకటనలో తెలిపింది.

రోజుకు 2.5 లక్షల పీపీఈల ఉత్పత్తి 
కోవిడ్‌ నుంచి కాపాడుకునేందుకు దేశీయంగా రోజుకు సుమారు 2.5 లక్షల పీపీఈలను, 2 లక్షల ఎన్‌–95 మాస్క్‌లను ఉత్పత్తి చేయగలుగుతున్నామని కేంద్ర మంత్రుల బృందానికి (జీఓఎం) అధికారులు తెలిపారు. మాస్క్‌లు, వెంటిలేటర్లు, పీపీఈల నాణ్యతలో రాజీ పడకూడదని, నాణ్యత పరీక్షలు నిర్వహించాలని జీఓఎం స్పష్టం చేసింది. కరోనా కేసుల పరిస్థితిపై అధికారులు జీఓఎంకు వివరించారు. కరోనా నియంత్రణకు సంబంధించి రాష్ట్రాలకు జారీ చేసిన మార్గదర్శకాలను కూడా వివరించారు. మే 4 నాటికి దాదాపు 9 కోట్ల మంది ఆరోగ్య సేతు యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకున్నారన్నారు.

మరిన్ని వార్తలు