నేపాలీ అమ్మాయిలతో భారతీయ అబ్బాయిల పెళ్లి

19 Nov, 2019 16:20 IST|Sakshi

లక్నో : వివాదాస్పదమైన అయోధ్య భూవివాదం కేసుకు సంబంధించి ఇటీవల సుప్రీకోర్టు తీర్పు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అయోధ్యలో  రామ మందిర నిర్మాణం కోసం కరసేవకులు చేసిన పోరాటం మనందరికీ తెలిసిందే. తాజాగా కరసేవకులు తీసుకున్న నిర్ణయం ఆసక్తిని రేకెత్తిస్తుంది. అదేంటంటే.. ఉత్తర్‌ప్రదేశ్‌లో పెళ్లిళ్లు కాకుండా ఉండిపోయిన అబ్బాయిలకు, సీతాదేవి జన్మస్థలమైన జనక్‌పూర్‌(నేపాల్‌) అమ్మాయిలను వివాహం పేరుతో ఒకటి చేయబోతున్నట్లు పిలుపునిచ్చారు.

ఈ మేరకు యూపీ, మధ్యప్రదేశ్, బీహార్‌ రాష్ట్రాల నుంచి మొత్తం 108 మంది తమ పేరును నమోదు చేసుకున్నట్లు తెలిపారు. ఈ వివాహ వేడుకను' శ్రీరామ్‌-జానకి వివాహ్‌ బరాత్‌ యాత్ర- అయోధ్య సే జనక్‌పూర్‌' పేరుతో నిర్వహించనున్నట్లు విశ్శ హిందూ పరిషత్‌కు చెందిన ధర్మయాత్ర మహాసంఘ్‌ వెల్లడించింది. ఈ వేడుకను మొత్తం 13 రోజుల పాటు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.

నవంబర్‌ 21న అయోధ్యలోని  కర్‌సేవక్‌పురమ్‌ జంకి ఘాట్‌ నుంచి కన్య పూజ, తిలకోత్సవం పేరుతో మొదలై  డిసెంబర్‌ 4న గోరక్‌పూర్‌లో జరిగే బరాత్‌ కార్యక్రమంతో ముగుస్తుందని పేర్కొన్నారు. చివరిరోజు వేడుకకు యూపీ ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్‌ హాజరవనున్నట్లు వెల్లడించారు. ఈ వేడుకుకు సంబంధించి యూపీ నుంచి అంబేద్కర్‌నగర్‌, మావు, అజామ్‌ఘర్‌, బీహార్‌ నుంచి బక్సర్, పటలీపుత్ర, హాజీపూర్‌, ముజఫర్‌పూర్‌,సీతామర్హి, దర్బంగా, మోతీహరి ప్రాంతాలను స్వాగత ద్వారాలుగా ఏర్పాటు చేశామని తెలిపారు. అయితే వీరి వివాహాలు నేపాల్‌లోని ధశరథ్‌ మందిర్‌లో నిర్వహించనున్నట్లు తెలిపారు.

ఈ కార్యక్రమం భారత్‌- నేపాల్‌ మధ్య సంబంధాలను మరింత పటిష్టం చేస్తుందని, అంతేగాక సంప్రదాయలో ఒకే విధంగా ఉండే రెండు దేశాల మధ్య అడ్డు ఉన్నది సరిహద్దు మాత్రమేనని పేర్కొన్నారు. ' రామ మందిర నిర్మాణం చేపట్టాలని సుప్రీంకోర్టు ఇచ్చిన చారిత్రాత్మక తీర్పుతో దీనిని ముడిపెట్టొద్దు. ప్రతీ ఐదేళ్లకోసారి ఇలాంటి వేడుకను నిర్వహిస్తుంటాం. అయితే ఈసారి యాదృశ్చికంగానే మాకు కలిసి వచ్చింది. ఈ కార్యక్రమానికి ప్రధాని మోదీ నుంచి యూపీ సీఎం వరకు ప్రతీ ఒక్కరిని ఆహ్వానించినట్లు' కార్యక్రమ నిర్వాహకుడు రాజేంద్ర సింగ్‌ పంకజ్‌ పేర్కొన్నారు.   

మరిన్ని వార్తలు