గాంధీజీ ప్రమాదంలో చనిపోయారట!

16 Nov, 2019 06:11 IST|Sakshi

వివాదాస్పదమైన ఒడిశా విద్యా శాఖ బుక్‌లెట్‌

భువనేశ్వర్‌: జాతిపిత మహాత్మా గాంధీ ప్రమాదం కారణంగా చనిపోయారంటూ ఒడిశా విద్యా శాఖ  ప్రచురించిన బుక్‌లెట్‌ తీవ్ర వివాదాస్పమైంది. దీనిపై రాజకీయ నేతలు, ఉద్యమకారుల నుంచి పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి. ఈ ఘటనపై ముఖ్యమంత్రి నవీన్‌ పట్నాయక్‌ క్షమాపణ చెప్పాలని, తప్పును వెంటనే సరిచేయాలని డిమాండ్‌ చేశారు. గాంధీజీ హత్యను ప్రమాదంగా ప్రచురించడాన్ని తీవ్రంగా తప్పుపట్టారు. దీంతో ఈ వ్యవహారంపై ఒడిశా ప్రభుత్వం సమగ్ర విచారణకు ఆదేశించింది.

గాంధీజీ 150వ జయంత్యుత్సవాల నేపథ్యంలో ఆమా బాపూజీ: ఏక్‌ ఝలకా (మన బాపూజీ: ఒక సంగ్రహ అవలోకనం) పేరిట ప్రచురించిన ఈ రెండు పేజీల బుక్‌లెట్‌లో గాంధీకి సంబంధించిన విషయాలు వివరించారు. ఈ క్రమంలో 1948 జనవరి 30న ఢిల్లీలోని బిర్లా హౌస్‌లో గాంధీ ప్రమాదం కారణంగా చనిపోయినట్లు పేర్కొన్నారు. విద్యా శాఖ మంత్రి సమీర్‌ రంజన్‌ దాస్‌ మాట్లాడుతూ ఈ వివాదంపై విచారణకు ఆదేశించామని, ఆ బుక్‌లెట్‌లను ఉపసంహరించుకున్నామని తెలిపారు. 

మరిన్ని వార్తలు