పేద విద్యార్థికి రాహుల్‌ లేఖ

22 Jul, 2018 19:50 IST|Sakshi

భోపాల్‌ : ప్రతిభను అడ్డుకునే శక్తి పేదరికానికి, కుటుంబ ఆర్థిక పరిస్థితులకు లేదని నిరూపించాడు ఓ విద్యార్థి. పీలికలు ఏరుకుని జీవనాన్ని సాగిస్తున్న ఓ నిరుపేద కుటుంబంలో పుట్టిన పేద విద్యార్థి ఆశారాం చౌదరి ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌ జోద్‌పూర్‌కు ఎంపికై ఔరా అనిపించాడు. విద్యార్థి ప్రతిభను మెచ్చుకుంటూ కాంగ్రెస్‌ జాతీయాధ్యక్షుడు రాహుల్‌ గాంధీ అభినందనలు తెలుపుతూ ఓ లేఖను రాశారు. ‘ఉన్నత విద్యాసంస్థలో ప్రవేశం పొందినందుకు ఆశారాంకు అభినందనలు. మహాత్మ గాంధీ చెప్పినట్లు.. శక్తి అనేది శారీరక చర్య నుంచి రాదు. చరగని సంకల్పం నుంచి వస్తుంది. అన్ని సవాళ్లు ఎదుర్కొని మంచి ర్యాంక్‌ సాధించారు. భవిష్యత్తు తరాలకు నువ్వు మర్గదర్శకుడివి కాగలవని నాకు నమ్మకం ఉంది’ అంటూ రాహుల్‌ లేఖలో పేర్కొన్నారు.

మధ్యప్రదేశ్‌ సీఎం శివరాజ్‌ సింగ్‌ కూడా ఆశారాంకు అభినందనలు తెలిపారు. తన చదువుకు అవసరైన ఆర్థిక సహాయం ప్రభుత్వం నుంచి అందిస్తామని సీఎం ప్రకటించారు. మధ్యప్రదేశ్‌లోని దీవాస్‌ జిల్లా మారుమూల గ్రామానికి చెందిన ఆశారాం ఆల్‌ ఇండియా స్థాయిలో 707 ర్యాంక్‌, ఓబీసీ కేటగిరిలో 141 ర్యాంకు సాధించారు. గ్రామంలో కనీసం కరెంట్‌ సౌకర్యం కూడా లేకున్నా, దీపం సహాయంతో చదువుకున్ని జాతీయ స్థాయిలో ప్రతిభ కనపరిచాడు. తనకు చదువుకోడానికి డబ్బులు లేకున్న తండ్రి పీలికలు ఏరి ఆ డబ్బుతో తనను చదివించాడని ఆశారం తెలిపారు. మొదటి ప్రయత్నంలో ఈ ర్యాంకును సాధించినట్లు ఇరవైఏళ్ల ఆశారాం వెల్లడించారు.

మరిన్ని వార్తలు