జైట్లీ జీ.. మీకు తోడుగా ఉంటాం: రాహుల్‌

17 Jan, 2019 12:55 IST|Sakshi
అరుణ్‌ జైట్లీ, రాహుల్‌ గాంధీ (ఫైల్‌)

న్యూఢిల్లీ : ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ అనారోగ్యంతో బాధపడుతున్న సంగతి తెలిసిందే. చికిత్స నిమిత్తం జైట్లీ విదేశాలకు వెళ్లారు. ఈ సందర్భంగా కాంగ్రెస్‌ జాతీయాధ్యక్షుడు రాహుల్‌ గాంధీ.. అరుణ్‌ జైట్లీ త్వరగా కోలుకోవాలంటూ ట్వీట్‌ చేశారు. అరుణ్‌ జైట్లీ అకస్మాత్తుగా అమెరికా వెళ్లారు. గత సంవత్సరం ఢిల్లీలోని ఎయిమ్స్‌లో జైట్లీకి మూత్రపిండ మార్పిడి శస్త్రచికిత్స జరిగిన విషయం తెలిసిందే. కిడ్నీ మార్పిడి ఆపరేషన్‌ అనంతరం విదేశాల్లో ఆయన చికిత్స పొందడం ఇదే ప్రథమం.

‘జైట్లీ జీ మేము ప్రతిరోజు మీ విధానాలతో విభేదిస్తుంటాము. కానీ మీ అనారోగ్యం వార్త మమ్మల్ని తీవ్రంగా కలచివేసింది. మీరు త్వరగా కోలుకోవాలని నేను, మా పార్టీ నాయకులందరం మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇలాంటి సమయంలో మీకు, మీ కుటుంబ సభ్యులకు 100 శాతం తోడుగా నిలుస్తామం’టూ రాహుల్‌ గాంధీ ట్వీట్‌ చేశారు. అరుణ్‌ జైట్లీ త్వరలోనే తిరిగి వస్తారని.. అందువల్ల ఈ శాఖ బాధ్యతలను ఎవరికి అప్పగించడం లేదని తెలిసింది. మధ్యంతర బడ్జెట్‌ ప్రవేశపెట్టే నాటికి జైట్లీ ఇక్కడ ఉంటారని తెలిసింది.

>
మరిన్ని వార్తలు