ఆలయం, పరిసరాల్లో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు
ప్రభుత్వ వైఖరిని తప్పుపట్టిన హిందూ సంఘాలు
శబరిమల: కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య శబరిమల అయ్యప్పస్వామి ఆలయం నేడు తెరుచుకోనుంది. అన్ని వయస్సుల మహిళలను ఆలయంలోకి అనుమతించాలన్న సుప్రీంకోర్టు తీర్పుతో గత నెలలో పూజల సందర్భంగా జరిగిన హింసాత్మక ఘటనల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమ యింది. భారీగా పోలీసులను మోహరిం చడంతోపాటు ఆలయ పరిసరాల్లో నిషేధాజ్ఞలు విధించింది. మొత్తం 2,300 మంది పోలీసులను మోహరించింది. ఈ చర్యలపై పండాలం రాచ కుటుంబం, బీజేపీ, కాంగ్రెస్ తోపాటు హిందూ సంఘాలు నిరసన వ్యక్తం చేశాయి. ఆలయం వద్ద విధి నిర్వహణ నిమిత్తం యువ మహిళా జర్నలిస్టులను పంపవద్దని ‘శబరిమల కర్మ సమితి’ మీడియా సంస్థలను కోరింది.
నేటి సాయంత్రం 5 గంటలకు..
ట్రావెన్కోర్ చిట్టచివరి రాజు తిరునాళ్ బలరామ వర్మ జయంతిని పురస్కరించుకుని మంగళవారం నిర్వహించే శ్రీ చిత్ర అట్ట తిరునాళ్ పూజల కోసం నేటి సాయంత్రం 5 గంటలకు ఆలయాన్ని తెరవనున్నారు. తాంత్రి కందారు రాజీవరు, ప్రధాన పూజారి ఉన్ని కృష్ణన్ నంబూద్రిలు ఆలయ ద్వారాలను తెరిచి, శ్రీకోవిల్లో దీపాలు వెలిగిస్తారు. మంగళవారం తిరునాళ్ పూజల అనంతరం రాత్రి 10 గంటలకు ఆలయాన్ని తిరిగి మూసివేస్తారు. మండల పూజల కోసం తిరిగి ఈ నెల 17న ఆలయాన్ని తెరిచి మూడు నెలలపాటు దర్శనం కోసం అనుమతిస్తారు.
విధి నిర్వహణలో భాగంగా ఆలయం వద్దకు రుతుక్రమం వయసున్న మహిళా జర్నలిస్టుల ను పంపొద్దని వీహెచ్పీ, హిందూ ఐక్యవేదిక తదితర సంస్థలతో కూడిన ‘శబరిమల కర్మ సమితి’ మీడియా నిర్వాహకులను కోరింది. 50 ఏళ్ల లోపు మహిళా జర్నలిస్టులు ఆలయంలోకి ప్రవేశించిన పక్షంలో పరిస్థితి చేయిదా టిపోతుందని హెచ్చరించింది. ఈ మేరకు మీడియా సంస్థల ఎడిటర్లకు లేఖలు పంపింది. పరిస్థితిని నియంత్రించడంలో ప్రభుత్వం విఫలమైందని కాంగ్రెస్ విమర్శించింది.