ఏది కష్టం.. మీరైతే ఏం చేస్తారు?

10 Jan, 2020 15:50 IST|Sakshi

న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా దేశ వ్యాప్తంగా ఆందోళనలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో బీజేపీ అధికార ప్రతినిధి సంబిత్‌ పాత్రా షేర్‌ చేసిన ఓ వీడియో నెట్టింట చర్చనీయాంశంగా మారింది. వాళ్లు జిన్నా వంటి స్వాతంత్ర్యం కోరుకుంటున్నారంటూ షేర్‌ చేసిన వీడియోలో.. ‘ఫ్రెండ్స్‌.... ఇంకా చెప్పాల్సింది ఏమైనా ఉందా? వాళ్లు హిందుస్తాన్‌ కోసం పనిచేస్తున్నారా లేదా దేశానికి వ్యతిరేకంగా ఉద్యమిస్తున్నారా? అసలు ఈ విషయంపై చర్చ అవసరమా? దేశానికి ఆవలి వైపున్న వారితో యుద్ధం చేయడం కష్టమా లేదా ఇలా దేశానికి ద్రోహం చేసే వాళ్లతో పోరాడటం కష్టమా.. మీరైతే ఏం చేస్తారు?’ అని ప్రశ్నించారు. (పౌరసత్వ చట్టం: ఎందుకీ ఆందోళనలు?)

కాగా షహీన్‌ భాగ్‌లో సీఏఏకు వ్యతిరేకంగా జరిగిన ఆందోళనకు చెందినదిగా భావిస్తున్న ఈ వీడియోలో... జిన్నా వాలీ ఆజాదీ నినాదం కంటే కూడా నెహ్రూవాలా ఆజాదీ, గాంధీ వాలా ఆజాదీ అనే నినాదాలు ఎక్కువగా వినిపించడం గమనార్హం. ఇక సంబిత్‌ పాత్రా పోస్టుపై కాంగ్రెస్‌ సీనియర్‌ నేత శశి థరూర్‌ స్పందించారు. అసలు ఈ వీడియో ఎంతవరకు నిజమైనదేనా ప్రశ్నించారు. కాగా డిసెంబరు 31, 2014 కి ముందు ఆఫ్గనిస్తాన్‌, బంగ్లాదేశ్‌ లేదా పాకిస్తాన్‌ నుంచి భారత్‌లోకి ప్రవేశించిన హిందూ, సిక్కు, బౌద్ధులు, జైనులు, పార్శీలు, క్రిస్టియన్లకు భారత పౌరసత్వం కల్పించేలా నరేంద్ర మోదీ సర్కారు చట్టం తీసుకవచ్చిన విషయం తెలిసిందే. 

మరిన్ని వార్తలు