వెంకయ్య నివాసంలో సంక్రాంతి వేడుకలు

22 Jan, 2018 03:22 IST|Sakshi
వెంకయ్య కుటుంబ సభ్యులతో కేంద్రమంత్రి సుష్మా స్వరాజ్‌

హాజరైన ప్రధాని మోదీ, మన్మోహన్, కేంద్ర మంత్రులు

సాక్షి, న్యూఢిల్లీ: ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు నివాసంలో సంక్రాంతి వేడుకలు ఆదివారం ఘనంగా జరిగాయి. ఢిల్లీలోని ఆయన అధికారిక నివాసంలో జరిగిన ఈ వేడుకల్లో ప్రధాని నరేంద్ర మోదీ, మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్, మాజీ ఉప రాష్ట్రపతి హమీద్‌ అన్సారీ, బీజేపీ అగ్రనేత ఎల్‌కె అద్వానీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షా, కేంద్ర మంత్రులు సుష్మా స్వరాజ్, నిర్మలా సీతారామన్, అరుణ్‌ జైట్లీ, అశోక్‌ గజపతిరాజు, స్మృతి ఇరానీ, విజయ్‌ గోయల్, అటార్నీ జనరల్‌ కె.కె. వేణుగోపాల్, రాజ్యసభ డిప్యూటీ చైర్మన్‌ పీజే కురియన్, ఏపీ మంత్రి కామినేని శ్రీనివాస్, ఎంపీలు కె. కేశవరావు, తోట నరసింహం తదితరులు పాల్గొన్నారు. ప్రధాని మాట్లాడుతూ.. భారత సంప్రదాయ పద్ధతులను, విశిష్టతను కాపాడుకోవాలని అన్నారు. దక్షిణాది రాష్ట్రాల ప్రజలకు ఆయన సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. వేడుకల్లో నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి. దక్షిణాది రాష్ట్రాల పసందైన వంటకాలతో వెంకయ్య అతిథులకు విందు ఏర్పాటు చేశారు.

మరిన్ని వార్తలు