మళ్లీ నోరుజారిన గవర్నర్‌..

7 Jan, 2019 18:03 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : జమ్ము కశ్మీర్‌లో హింస తగ్గుముఖం పట్టిందని చెబుతూ ఆ రాష్ట్ర గవర్నర్‌ సత్యపాల్‌ మాలిక్‌ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. కశ్మీర్‌లో రాళ్ల దాడులు, ఉగ్రవాద సంస్ధల్లో నియామకాలను నిరోధించామని ఆయన చెప్పకొచ్చారు. పట్నాలో ఒకరోజు జరిగే హత్యలు కశ్మీర్‌లో వారం రోజుల్లో జరిగే మరణాలతో సమానమని గవర్నర్‌ వ్యాఖ్యానించారు.

కాగా, కశ్మీర్‌లో శాంతి భద్రతల పరిస్ధితిని వివరించేందుకు పట్నాతో పోలిక తెస్తూ గవర్నర్‌ చేసిన వ్యాఖ్యల పట్ల బిహార్‌ నేతలు మండిపడుతున్నారు. జమ్మూ కశ్మీర్‌లో అసెంబ్లీ రద్దు చేసిన సందర్భంలోనూ గవర్నర్‌ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. తాను బదిలీ ముప్పును ఎదుర్కొంటున్నానని బహిరంగంగా వెల్లడించారు.

ఢిల్లీ ఆదేశాలను పాటిస్తే తాను సజద్‌ లోన్‌ను ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని, అలా చేసి తాను చరిత్రహీనుడిగా మిగిలిపోదల్చుకోలేదని వ్యాఖ్యానించారు. నిజాయితీలేని వ్యక్తిగా తాను ఉండదలుచుకోలేదని ఫలితంగా ఎదురయ్యే పరిణామాలను ఎదుర్కొంటానని చెప్పుకొచ్చారు. కాగా గత నాలుగు నెలలుగా జమ్మూ కశ్మీర్‌లో హింసాత్మక ఘటనలు తగ్గుముఖం పట్టాయని కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ ఇటీవల పేర్కొన్న సంగతి తెలిసిందే.

మరిన్ని వార్తలు