సాయంత్రంలోపు లొంగిపో...

28 Sep, 2015 12:58 IST|Sakshi
సోమనాథ్ భారతి(ఫైల్)

ఢిల్లీ: గృహ హింస కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఢిల్లీ న్యాయశాఖ మాజీ మంత్రి సోమనాథ్ భారతికి సుప్రీంకోర్టులోనూ చుక్కెదురైంది. ఆయన పెట్టుకున్న బెయిల్ పిటిషన్ను సోమవారం న్యాయస్థానం కొట్టివేసింది. ఈ సాయంత్రం ఆరు గంటల్లోగా లొంగిపోవాలని ఆయనను ఆదేశించింది. 'ముందు లొంగిపోండి, తరువాత మధ్యవర్తిత్వం గురించి ఆలోచించొచ్చు' అని  సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. ఈ కేసులో తదుపరి విచారణను గురువారానికి వాయిదా వేసింది. అయితే ఈ సమాచారాన్ని సోమనాథ్ భారతి తనకు అందుబాటులోకి రాగానే తెలియజేస్తానని ఆయన తరపు న్యాయవాది విజయ్ అగర్వాల్ చెప్పారు.
   
గృహహింస, హత్యాయత్నం ఆరోపణలు ఎదుర్కొంటున్న సోమనాథ్ భారతి పోలీసులకు  దొరక్కుండా తప్పించుకు తిరుగుతున్నారు.  రకరకాల ప్రదేశాల్లో తిరుగుతూ,  వివిధ ఫోన్  నంబర్లను మారుస్తూ పోలీసులకు చుక్కలు చూపిస్తున్నారు.  గృహహింస కేసులో తనను అరెస్ట్ చేయకుండా రక్షించాలని కోరుతూ సోమనాథ్ భారతి అంతకుముందు పెట్టుకున్న ముందస్తు (యాంటిసిపేటరీ) బెయిల్  పిటిషన్ ను ఢిల్లీ హైకోర్టు తోసిపుచ్చింది.  ఈ నేపథ్యంలో ఆయన సుప్రీంను ఆశ్రయించారు.

కాగా సోమనాథ్‌ భారతి పోలీసులకు లొంగిపోవాలని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రివాల్‌ ఇదివరకే సూచించారు. అరెస్టు కాకుండా తప్పించుకోవడానికి ప్రయత్నించడం ద్వారా ఆయన పార్టీకి అప్రతిష్ట తెస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.  తద్వారా పార్టీతోపాటు, ఆయన కుటుంబానికి ఇబ్బందులు సృష్టిస్తున్నారని కేజ్రివాల్‌ ట్వీట్‌ చేశారు.

మరిన్ని వార్తలు