పోలీసుల వేట.. పరారీలో నిత్యానంద!

22 Nov, 2019 11:58 IST|Sakshi

సాక్షి, బెంగళూరు: బెంగళూరులోని బిడది ధ్యాన పీఠాధిపతి వివదాస్పద అధ్యాత్మిక గురువు నిత్యానంద పరారీలో ఉన్నట్లు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. లైంగిక వేధింపులు తదితర ఆరోపణలు ఎదుర్కొంటున్న నిత్యానంద ఏడాదిన్నరగా బిడది ధ్యాన పీఠానికి రావడం లేదు. నిత్యానంద కోసం ధ్యానపీఠంలో వాకబు చేయగా ఆయన ఉత్తర భారత పర్యటనలో ఉన్నట్లు చెబుతున్నారు. గుజరాత్‌లోనూ నిత్యానందకు మఠం ఉండడంతో అక్కడకి వెళ్లి ఉండవచ్చునని భావిస్తున్నారు. నకిలీ పాస్‌పోర్టు ఉపయోగించి నిత్యానంద ఆస్ట్రేలియా దగ్గర్లోని ద్వీపానికి వెళ్లినట్లు వార్తలొచ్చాయి.

కాగా అహ్మదాబాద్‌లోని నిత్యానంద ఆశ్రమంలో నిర్భంధించిన తన ఇరువురు కుమార్తెలను విడిపించాలని ఓ తల్లిదండ్రులు గుజరాత్‌ హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. కోర్టు ఆదేశాల మేరకు ఇరువురిని విముక్తి కల్పించిన పోలీసులు నిత్యానందతో పాటు అహ్మదాబాద్‌కు చెందిన ఇరువురు ఆశ్రమ ముఖ్యులపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. వివాదాలు తారాస్థాయికి చేరడంతో నిత్యానంద ఆచూకీ తెలుసుకునేందుకు గురువారం బిడిదిలోని ధ్యానపీఠంకు పోలీసులు వెళ్ళగా సమగ్ర సమాచారం ఇవ్వలేదు. నిత్యానంద బిడిది ధ్యానపీఠంకు వచ్చి కొన్ని నెలలు అయ్యిందని అహ్మదాబాద్‌ ఆశ్రమంలో ఉండవచ్చునని తెలిపినట్లు సమాచారం. అయితే అతను విదేశాలకు పారిపోకుండా ఉండేందుకు అధికారులు ముందస్తుగానే ఆయన పాస్‌పోర్ట్‌ను రద్ద చేశారు.

మరిన్ని వార్తలు