గుజరాత్‌ కాంగ్రెస్‌ ఎమ్మెల్యే ఇంట్లో యువకుడి ఉరి

30 Oct, 2023 06:09 IST|Sakshi

జునాగఢ్‌: గుజరాత్‌ రాష్ట్రం జునాగఢ్‌ జిల్లా చార్వాడ్‌ గ్రామంలో కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే విమల్‌ చుదాసామా ఇంట్లో ఓ యువకుడు(28) అనుమాస్పద స్థితిలో ఉరికి వేలాడుతూ శవమై కనిపించాడు.  ఘటనా స్థలంలో సూసైడ్‌ నోట్‌ లభించిందని, తన ఆత్మహత్యకు ఎమ్మెల్యే విమల్‌తోపాటు అతడి అత్త, మామ వేధింపులే కారణమంటూ ఆ లేఖలో ఉందని వివరించారు. బలవన్మరణానికి పాల్పడిన యువకుడిని నితిన్‌ పర్మర్‌గా పోలీసులు గుర్తించారు.

శనివారం అర్ధరాత్రి తర్వాత ఇంటి పైకప్పునకు ఉరి వేసుకొని చనిపోయినట్లు చెప్పారు. చనిపోయిన యువకుడు నితిన్‌ ఎమ్మెల్యేకు దగ్గరి బంధువేనని తెలిసిందని అన్నారు. అయితే, ఎమ్మెల్యే విమల్‌ వాదన మరోలా ఉంది. నితిన్‌ను ఎవరో హత్య చేశారని, తనను అప్రతిష్టపాలు చేయడానికే ఆత్మహత్య చేసుకున్నట్లు చిత్రీకరించారని, నకిలీ సూసైడ్‌ నోట్‌ను సృష్టించారని ఆరోపించారు. నితిన్‌ చావుకు తానే కారణం అంటూ రాజకీయ ప్రత్యర్థులు నిందలు మోపుతున్నారని వాపోయారు. 

మరిన్ని వార్తలు