కనికా కపూర్‌కు కరోనా

21 Mar, 2020 07:02 IST|Sakshi
కనికా కపూర్‌

బాలీవుడ్‌ ప్రముఖ గాయని కనికా  కపూర్‌కు కరోనా పాజిటివ్‌ అని తేలడంతో ఏకంగా ఎంపీలు సెల్ఫ్‌ క్వారంటైన్‌ విధించుకోవాల్సిన అగత్యం ఏర్పడింది. వివరాల్లోకి వెళితే గాయని కనికా కపూర్‌ ఇటీవల లక్నోలో ఓ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. అందులో రాజస్తాన్‌ మాజీ ముఖ్యమంత్రి వసుంధర రాజే, ఆమె కుమారుడు దుష్యంత్‌ సింగ్‌లు పాల్గొన్నారు. ఇప్పుడు కనికా కపూర్‌కు కరోనా పాజిటివ్‌ అని తేలడంతో వసుంధర రాజే, దుష్యంత్‌ సింగ్‌లు సెల్ఫ్‌ క్వారంటైన్‌లోకి వెళ్లారు.

రాజస్తాన్‌ నుంచి ఎంపీగా ఉన్న దుష్యంత్‌ పార్లమెంటులో తృణమూల్‌ కాంగ్రెస్‌ ఎంపీ డెరెక్, ఎంపీ అనుప్రియా పటేల్‌లతో సన్నిహితంగా మెలిగారు. దీంతో వారివురు కూడా సెల్ఫ్‌ క్వారంటైన్‌ విధించుకుంటున్నట్లు ప్రకటించారు. అంతేగాక మార్చి 18న రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ ఇచ్చిన ఉపాహార విందుకు పలువురు ఎంపీలతోపాటు దుష్యంత్‌ కూడా హాజరయ్యారని, బుధవారం రవాణా, సాంస్కృతిక శాఖలు నిర్వహించిన సమావేశంలోనూ దుష్యంత్‌ 20 మంది ఎంపీలతో కలిసి ఉన్నారని డెరెక్‌ వివరించారు. ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో పార్లమెంటు సమావేశాలను వాయిదా వేయాలని ఆయన కోరారు. 

మరిన్ని వార్తలు