మీకిదే ఆఖరి ఛాన్స్‌: కేంద్రంపై సుప్రీం ఫైర్‌

20 Feb, 2018 15:38 IST|Sakshi
భారత అత్యున్నత న్యాయస్థానం (సుప్రీంకోర్ట్‌ ఆఫ్‌ ఇండియా)

సాక్షి, న్యూఢిల్లీ : కేంద్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు అల్టిమేటం జారీ చేసింది. పార్లమెంటు సభ్యుల జీతభత్యాలు, అలవెన్సుల విషయానికి సంబంధించి శాశ్వత ప్రతిపాదికన ఒక ప్రత్యేక కార్యాచరణ వ్యవస్థను ఎప్పుడు ఏర్పాటు చేస్తారని ప్రశ్నించింది. వారంలోగా దీనిపై పూర్తి వివరణ ఇవ్వాల్సిందేనని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జే చలమేశ్వర్‌, జస్టిస్‌ సంజయ్‌ కృష్ణన్‌ కౌల్‌లతో కూడిన ద్విసభ్య ధర్మాసనం ఆదేశించింది. గతంలోనే ఈ విషయంపై సుప్రీంకోర్టు కేంద్రాన్ని ప్రశ్నించగా 2017 సెప్టెంబర్‌ 1న త్వరలోనే పూర్తి చేస్తామంటూ ఓ అఫిడవిట్‌ను దాఖలు చేసింది. కానీ, ఇంతవరకు అది కార్యాచరణకు నోచుకోలేదు.

దీంతో ఈ విషయంపై మంగళవారం విచారణ చేపట్టిన సుప్రీం ధర్మాసనం 'భారత ప్రభుత్వ విధానం బలమైనది. దాన్ని మీరు ప్రతి రోజు ఎప్పుడంటే అప్పుడు మార్చలేరు' అని కేంద్రం తరపున సుప్రీంకోర్టుకు హాజరైన న్యాయవాది అజిత్‌ సిన్హాను అత్యున్నత ధర్మాసనం మందలించింది. 'మీరు చెప్పినట్లుగా మీరు నడుచుకోలేదు. మీరు 2017లో ఇచ్చిన అఫిడవిట్‌లో శాశ్వత మెకానిజానికి సంబంధించి స్పష్టంగా లేదు. మీరు ఎప్పుడు ఆ పని పూర్తి చేయనున్నారు.. అసలు దానిపై ప్రభుత్వ వ్యూహాం ఏమిటి? అసలు ఆ విధానం కావాలనుకుంటున్నారా? వద్దని అనుకుంటున్నారా? మీరు దాఖలు చేసిన కౌంటర్‌ అఫిడవిట్‌లో సంతృప్తికరమైన వివరణ ఏదీ లేదు. మాకు ఇప్పుడు చెప్పడానికి మీ దగ్గర ఒక్క మాట లేకపోవచ్చు.. కానీ మీకు మాత్రం బహుశా ఇదే చివరి అవకాశం' అని కోర్టు హెచ్చరించింది.

మరిన్ని వార్తలు