చిదంబరం పిటిషన్లపై నేడు సుప్రీం విచారణ

26 Aug, 2019 03:59 IST|Sakshi

న్యూఢిల్లీ: ఐఎన్‌ఎక్స్‌ మీడియా కేసులో ముందస్తు బెయిల్‌ పిటిషన్‌ను తిరస్కరిస్తూ ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సవాల్‌ చేస్తూ మాజీ ఆర్థిక మంత్రి చిదంబరం పెట్టుకున్న పిటిషన్‌ను సుప్రీంకోర్టు సోమవారం విచారించనుంది. ఈ పిటిషన్‌తోపాటు ఇదే కేసులో దిగువ కోర్టు తనపై అరెస్టు వారెంట్‌ జారీ చేయడం, సోమవారం వరకు సీబీఐ కస్టడీకి పంపాలంటూ ఉత్తర్వులు ఇవ్వడాన్ని సవాల్‌ చేయడంపై కోర్టు బెంచ్‌ విచారణ జరపనుంది.

హైకోర్టు ఉత్తర్వులను సవాల్‌ చేస్తూ వేసిన తన పిటిషన్‌ను జూలై 20, 21వ తేదీల్లో సుప్రీంకోర్టు విచారించక పోవడం వల్లే ఆగస్టు 21వ తేదీన అరెస్టయ్యానని చిదంబరం తెలిపారు. ఈ చర్యల రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 21 ప్రకారం ప్రాథమిక హక్కులకు భంగం కలిగించడమేనని ఆ పిటిషన్‌లో పేర్కొన్నారు. ఈ మనీలాండరింగ్‌ కేసులో సోమవారం వరకు చిదంబరంను అరెస్టు చేయకుండా తాత్కాలిక రక్షణ కల్పిస్తూ శుక్రవారం అత్యున్నత న్యాయస్థానం ఈడీని ఆదేశించిన విషయం తెలిసిందే. చిదంబరం పిటిషన్లపై సమాధానం ఇవ్వాల్సిందిగా న్యాయస్థానం ఈడీని కూడా ఇప్పటికే ఆదేశించింది. ఈడీ తరఫున సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా వాదనలు వినిపిస్తూ..దీని వెనుక భారీ మనీలాండరింగ్‌ కుట్రకోణం ఉందని తెలిపారు.

మరిన్ని వార్తలు