బిహార్‌లో ఎన్‌డీఏ కెప్టెన్‌ నితీష్‌..?!

11 Sep, 2019 20:00 IST|Sakshi

పాట్న: బిహార్‌ ముఖ్యమంత్రి నితీష్‌కుమార్‌పై డిప్యూటీ సీఎం, బీజేపీ సీనియర్‌ నేత సుశీల్‌ మోదీ సంచలన వ్యాఖ్యలు చేశారు. 2020లో  జరగబోయే బిహార్‌ అసెంబ్లీ ఎన్నికల్లో నితీష్‌కుమార్‌ ఎన్‌డీఏ కూటమికి కెప్టెన్‌గా మారి నాయకత్వం వహిస్తారని, అందులో భాగంగా ఫోర్‌, సిక్స్‌లు బాదుతూ.. ప్రత్యర్థుల ఇన్నింగ్స్‌ను ఓడిస్తారని’ ట్విటర్‌ వేదికగా పేర్కొన్నారు. దీంతో ఒక్కసారిగా బిహార్‌ రాజకీయాలు వేడెక్కాయి.

దీనిపై బీజేపీ అధికార ప్రతినిధి నిఖిల్ ఆనంద్ స్పందించి.. ‘రాష్ట్ర అభివృద్ధి కోసం నితీష్ కుమార్ నాయకత్వంలో  బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిందని తెలిపారు. బీజేపీ కేంద్ర నాయకత్వం నిర్ణయంపై ఎటువంటి వివాదం లేదన్నారు. ప్రజల, వ్యక్తిగత అభిప్రాయాలను ప్రచారం చేయడం పార్టీ వైఖరికి పూర్తిగా విరుద్ధంగా ఉంటుందని’ అన్నారు.

ఇటీవల బిహార్‌ శాసన మండలి సభ్యుడు, మాజీ కేంద్ర మంత్రి సంజయ్‌ పాస్వాన్‌ ‘ప్రధాని నరేంద్ర మోదీ నిర్ణయాలకు రాష్ట్ర ప్రజలు మద్దతు ఇస్తున్నందున నితీష్‌ కుమార్ కేంద్ర రాజకీయాలపై దృష్టి పెట్టాలని వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సుశీల్‌ మోదీ నితీష్‌పై చేసిన వ్యాఖ్యలను ట్విటర్‌లో తొలగించనట్లు సమాచారం.

మరిన్ని వార్తలు