గ్రాట్యుటీ పన్ను మినహాయింపు రూ. 20 లక్షలు!

15 Jan, 2018 03:05 IST|Sakshi

న్యూఢిల్లీ: రూ.20 లక్షల వరకు గ్రాట్యుటీపై పన్ను మినహాయింపు ఇచ్చే గ్రాట్యుటీ చెల్లింపు సవరణ బిల్లు–2017ను వచ్చే బడ్జెట్‌ సమావేశాల్లోనే పార్లమెంట్‌ ఆమోదించే అవకాశాలున్నాయి. దీని ప్రకారం.. 5 ఏళ్లు అంతకంటే ఎక్కువ కాలం ఒక సంస్థలో పనిచేసి రిటైరయ్యే లేదా వైదొలిగే వారు పొందే గ్రాట్యుటీపై రూ.20లక్షల వరకు పన్ను ఉండదు. ప్రస్తుతం రూ.10 లక్షల వరకు గ్రాట్యుటీపై మాత్రమే పన్ను మినహాయింపు ఉంది.

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులతోపాటు పది అంతకంటే ఎక్కువ మంది పనిచేసే ఫ్యాక్టరీలు, గనులు, చమురు క్షేత్రాలు, ప్లాంటేషన్లు, నౌకాశ్రయాలు, రైల్వే కంపెనీలు, దుకాణాలు తదితర వ్యవస్థీకృత రంగ సంస్థలకు ఇది వర్తిస్తుంది. ఈ బిల్లు శీతాకాల సమావేశాల్లో లోక్‌సభ ఆమోదం కూడా పొందింది. మహిళలకు మాతృత్వ సెలవులను పొడిగించే మెటర్నిటీ బెనిఫిట్‌ సవరణ బిల్లు–2017ను ఈ సమావేశాల్లో పార్లమెంట్‌లో ప్రవేశపెట్టనున్నారు.

బడ్జెట్‌ సమావేశాల్లోనే వేతన కోడ్‌ బిల్లు
బడ్జెట్‌ సమావేశాల్లో వేతన కోడ్‌ బిల్లును పార్లమెంట్‌లో ప్రవేశపెట్టనున్నారు. దీని ప్రకారం  కనీస వేతన పరిమితి అమల్లోకి వస్తుంది. ఏ రాష్ట్ర ప్రభుత్వం అంతకంటే తక్కువ వేతనం నిర్ణయించకూడదు.

మరిన్ని వార్తలు