యూపీ ‘మూడో దశ’ నేడు

19 Feb, 2017 02:50 IST|Sakshi
యూపీ ‘మూడో దశ’ నేడు

లక్నో: దేశవ్యాప్తంగా ఆసక్తి రేపుతున్న ఉత్తరప్రదేశ్‌ ఎన్నికల మూడో దశకు అన్ని ఏర్పాట్లూ పూర్తయ్యాయి. 69 స్థానాలకు ఆదివారం జరగనున్న ఈ దశ పోలింగ్‌లో హోంమంత్రి రాజ్‌నాథ్‌ లోక్‌సభ స్థానం లక్నో, ఎస్పీకి పట్టున్న కన్నౌజ్, మైన్ పురి, ఇటావా ప్రాంతాలున్నాయి. ఫరూకాబాద్, హర్దోయ్, అవురైయా, కాన్పూర్‌ దేహత్, కాన్పూర్, ఉన్నావో, బరాబంకి, సీతాపూర్‌ తదితర 12 జిల్లాల్లో జరుగుతున్న ఈ దశ పోలింగ్‌లో 2.41 కోట్ల మంది ఓటర్లు 826 మంది అభ్యర్థుల భవితవ్యం తేల్చనున్నారు.

మొత్తం 25,603 పోలింగ్‌ బూత్‌లు ఏర్పాటు చేశారు. ఇటావా... ఎస్పీ వ్యవస్థాపక అధ్యక్షుడు ములాయంసింగ్‌ యాదవ్‌ సొంత జిల్లా. ముఖ్యమంత్రి అఖిలేశ్‌ యాదవ్‌ సతీమణి డింపుల్‌యాదవ్‌ కన్నౌజ్‌ ఎంపీ. ఎస్పీ మరో కీలక ఎంపీ తేజ్‌ప్రతాప్‌æ యాదవ్‌ది మైన్ పురి జిల్లా. దీంతో ఈ దశ అన్ని పార్టీలకూ ప్రతిష్టాత్మకంగా మారింది. 2012 అసెంబ్లీ ఎన్నికల్లో ఈ 69 స్థానాల్లో ఎస్పీ 55 గెలుచుకుంది.

మరిన్ని వార్తలు