లేని కాలేజీలో.. లా చదివారట!

1 Jun, 2014 02:16 IST|Sakshi
లేని కాలేజీలో.. లా చదివారట!

కేంద్రమంత్రి ముండేపై కాంగ్రెస్ విసుర్లు.
 

న్యూఢిల్లీ: ఎన్‌డీఏ ప్రభుత్వంలోని మంత్రుల విద్యార్హతలపైనే కాంగ్రెస్ ప్రధానంగా దృష్టి పెట్టినట్లు కనిపిస్తోంది. నిన్నటివరకు మానవ వనరుల శాఖ మంత్రి స్మృతి ఇరానీ కనీసం డిగ్రీ కూడా చేయలేదంటూ విమర్శలు గుప్పించిన కాంగ్రెస్.. తాజాగా గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి గోపీనాథ్ ముండే విద్యార్హతలను ప్రశ్నించింది. 1978లో ప్రారంభమైన కళాశాల నుంచి 1976లోనే ముండే డిగ్రీ పూర్తి చేశాడంటూ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి షకీల్ అహ్మద్ శనివారం ట్విటర్‌లో ఎద్దేవా చేశారు. ముండే డిగ్రీ పూర్తి చేసిన నాటికి అసలా కాలేజే ప్రారంభం కాలేదన్నారు.

పుణేలోని న్యూ లా కాలేజ్‌లో 1976లో బీజేఎల్ డిగ్రీ పూర్తి చేసినట్లు 2014 ఎన్నికల అఫిడవిట్‌లో గోపీనాథ్ ముండే పేర్కొన్నారని, అయితే, ఆ కాలేజ్ 1978లో ప్రారంభమైనట్లు ఆ కళాశాల వెబ్‌సైట్లో ఉందని అహ్మద్ వివరించారు. ముండేను సంప్రదించి, వివరణ కోరేందుకు మీడియా ప్రయత్నించగా.. స్పందన రాలేదు. కాగా, ఇరానీ ప్రవేశానికి సంబంధించిన పత్రాలను లీక్ చేశారన్న ఆరోపణలపై ఢిల్లీ యూనివర్సిటీకి చెందిన ఐదుగురు బోధనేతర ఉద్యోగులను శుక్రవారం యాజమాన్యం సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. వారిని మళ్లీ విధుల్లోకి తీసుకోవాల్సిందిగా స్మృతి ఇరానీ యూనివర్సిటీ అధికారులకు విజ్ఞప్తి చేశారు.
 

>
మరిన్ని వార్తలు