సైన్స్‌ కాంగ్రెస్‌లో టైమ్‌ క్యాప్సూ్యల్‌

5 Jan, 2019 04:27 IST|Sakshi

జలంధర్‌ నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి: ఇండియన్‌ సైన్స్‌ కాంగ్రెస్‌ వేదిక లవ్లీ ప్రొఫెషనల్‌ యూనివర్సిటీ(ఎల్పీయూ)లో శుక్రవారం ఒక చారిత్రక ఘట్టం నమోదు అయింది. ప్రస్తుతం మనుషులు రోజూ వాడుతున్న పరికరాలను టైమ్‌ క్యాప్సూ్యల్‌(కాలనాళిక)లో ఉంచి భూగర్భంలో నిక్షిప్తం చేశారు. నోబెల్‌ అవార్డు గ్రహీతలు డంకన్‌ హాల్డెన్, అవ్‌ రామ్‌ హెర్‌‡్ష కోవ్, థామస్‌ సుడాఫ్‌ ఒక మీట నొక్కగానేప్రత్యేకంగా తయారైన ఉక్కు అల్మారా భూమికి పది అడుగుల లోతైన గుంతలోకి వెళ్లింది. ఎల్పీయూలోని యునిపోలిస్‌ ఆడిటోరియంలో నిక్షిప్తమైన క్యాప్సూ్యల్‌ను 100 సంవత్సరాల తర్వాత తెరుస్తారు. స్మార్ట్‌ఫోన్, ల్యాప్‌ టాప్, డ్రోన్, వీఆర్‌ గ్లాస్, ఎలక్ట్రిక్‌ కుక్‌ టాప్‌లతో పాటు భారత శాస్త్ర సాంకేతిక పరిజ్ఞాన పురోగతికి గుర్తుగా మంగళ్‌యాన్, తేజస్‌ యుద్ధ విమానం, బ్రహ్మోస్‌ క్షిపణి నమూనాలను అందులో దాచినట్లు ఎల్పీయూ చాన్స్‌లర్‌ అశోక్‌ మిట్టల్‌ తెలిపారు.

మెచ్చినట్లుగా ముత్యాల తయారీ!
ముత్యపు చిప్పలోకి ప్రత్యేక పద్ధతిలో ముత్యపు కేంద్రకాన్ని చొప్పించడం ద్వారా మనకు నచ్చిన ఆకారంలో ముత్యాలను తయారు చేసుకోవచ్చునని భారత వ్యవసాయ పరిశోధన సమాఖ్య (ఐసీఏఆర్‌) డిప్యూటీ డైరెక్టర్‌ జనరల్‌ డాక్టర్‌ జేకే జెన్నా తెలిపారు. వినాయకుడి విగ్రహం మొదలుకొని వేర్వేరు ఆకారాల్లో వీటిని తయారు చేయవచ్చని తెలిపారు. పరిజ్ఞానం 15 ఏళ్లుగా ఉన్నా మానవవనరుల కొరత కారణంగా ప్రాచుర్యం పొందలేదన్నారు.

మరిన్ని వార్తలు