ప్రశాంతంగా పండుగలు జరుపుకోవాలి : డీసీపీ

1 Oct, 2014 23:00 IST|Sakshi

 భివండీ, న్యూస్‌లైన్: పట్టణంలో బతుకమ్మ, దసరా పండుగలను ప్రశాంతంగా జరుపుకోవాలని డీసీపీ సుదీర్ దాబాడే ప్రజలకు విజ్ఞప్తి చేశారు. అఖిల పద్మశాలి సమాజం  కార్యాలయంలో  తెలుగు ప్రజలు బతుకమ్మ సంబరాలను ఘనంగా జరుపుకొంటున్నారు. ఈ సందర్భంగా బుధవారం ఏర్పాటు చేసిన సభలో డీసీపీ సుదీర్ దాబాడే మాట్లాడుతూ.. ఠాణే జిల్లాలో బతుకమ్మ వేడుకలకు భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు.

 తెలుగు సమాజానికి చెందిన మహిళా వాలంటీర్లను ప్రధాన ఘాట్ల వద్ద నియమిస్తున్నామని, దొంగతనాల నివారణకు సీసీ కెమెరాలను ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు.  మహిళా పోలీసులు, కానిస్టేబుళ్లు ప్రధాన వీధుల్లో సివిల్ డ్రస్స్‌లల్లో విధులు నిర్వహిస్తారని చెప్పారు. గురువారం నిమజ్జనం సందర్భంగా విదుత్ కోత ఉండకుండా చర్యలు తీసుకోవాలని టోరంట్ పవర్ కంపెనీ అధికారులకు సూచించామని చెప్పారు. రాత్రి 12 గంటల లోపే బతుకమ్మల నిమజ్ఞం నిర్వహించాలని, పోలీసులకు ప్రజలు సహకరించాలని ఆయన కోరారు.

 ఈ కార్యక్రమంలో పట్టణ పోలీస్ స్టేషన్ సీనియర్ ఇన్‌స్పెక్టర్ ఎన్‌డీ రోడేతో పాటు అఖిల పద్మశాలి సమాజ అధ్యక్షుడు కముటం శంకర్, కార్యదర్శి దాసి అంబాదాస్, న్యాయదాని కమిటి చైర్మన్ కొంక మల్లేశం, వేముల నర్సయ్య, పాశికంటి లచ్చయ్య, గాజుల రాజారాం, వంగ పురుషోత్తం, మాజీ నగరాధ్యక్షుడు ఎస్. మల్లేశం, బొల్లి రమేశ్, వడ్లకొండ రాముతో పాటు భారీ సంఖ్యలో కుల బాంధవులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు